విశాఖ ఏజెన్సీలో శిశు మరణాలపై గవర్నర్ ఆందోళన

విశాఖ ఏజెన్సీలో శిశు మరణాలపై గవర్నర్ ఆందోళన
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని పెదబయలు మండలం పాతరూడకోటలో శిశు మరణాలు పెరుగుతుండటం పట్ల రాష్ట్ర  గవర్నరు విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. షెడ్యూల్‌ కులాలు, గిరిజన ప్రాంతాల పాలనాధికారి హోదాలో నివేదికను తెప్పించుకోవడమే కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని రాజ్‌భవన్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌సి సిసోడియాను ఆదేశించారు. 
 
ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమశాఖ సమగ్ర నివేదికను ఆ శాఖ కార్యదర్శి రాజ్‌భవన్‌కు మంగళవారం పంపారు. ఇందులో పాతరూడకోట గ్రామంలో పలు గిరిజన తెగలకు చెందిన 138 కుటుంబాలు నివసిస్తున్నాయని, 2018 మే నుంచి 14 మంది శిశువులు మరణించిన విషయాన్ని నివేదికలో పొందుపరిచారు. గత 9 నెలల్లోనే 8 శిశుమరణాలు నమోదు కాగా, అన్ని మరణాలూ పుట్టిన మూడు నెలల్లోనే జరిగాయని పేర్కొన్నారు. 
 
సంస్థాగత ప్రసవాలు జరిగాయని, తల్లులు మంచి ఆరోగ్య స్థితిలో ఉన్నారని, పిల్లలు సాధారణ జనన బరువుతో జన్మించారని నివేదిక వెల్లడించింది. మంచినీటి గొట్టాలు తుప్పుపట్టి తాగునీరు కలుషితం కావడంతోపాటు తల్లుల్లో కాల్షియం లోపమే శిశు మరణాలకు కారణమని సమగ్ర విచారణలో తేలింది. 
 
గవర్నరు జోక్యంతో గిరిజన సంక్షేమ శాఖలో కదలిక వచ్చింది. తాగునీటి పైపులైన్లు మార్చడంతోపాటు అత్యవసర వైద్య సేవల కోసం రెండు అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలించేందుకు విశాఖ కెజిహెచ్‌ నుంచి మల్టీ స్పెషలిస్టు బృందం గ్రామాన్ని సందర్శించింది. 
 
నవజాత శిశువుల పెంపకంలో అవగాహన లేమి, చిన్నారుల శ్వాసకోశ వైఫల్యం కూడా శిశు మరణాలకు కారణమని వైద్యులు కనుగొన్నారు. గ్రామంలో తక్షణ సేవల కోసం స్టాఫ్‌ నర్సును నియమించారు. ముంచంగిపుట్టులో ప్రసవాల కోసం వేచి ఉండే కేంద్రంలో బాలింతలతోపాటు పాలిచ్చే తల్లులు బస చేసేందుకు గర్భిణులు, బాలింతలకు అదనపు పౌష్టికాహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకున్నారు. 
 
ఏజెన్సీ ప్రాంతంలో సరైన కమ్యూనికేషన్‌ సౌకర్యాల ఏర్పాటు, రుద్రకోట, పాతరూడకోట గ్రామాల మధ్య వాగుపై వంతెన నిర్మాణం, నివాస గృహాల నిర్మాణం వంటి దీర్ఘకాలిక చర్యలను తీసుకోవాలని గవర్నరు విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని రాజ్‌భవన్‌ కార్యదర్శిని ఆదేశించారు.