వీఎల్‌ దత్‌ జీవితం యువతరానికి ఆచరణీయం

ఉన్నతమైన, ధనవంతుల కుటుంబంలో జన్మించిన దివంగత పారిశ్రామికవేత్త వీఎల్‌ దత్‌ నిరాడంబర మనస్తత్వాన్ని కలిగివుండేవారని, కార్పొరేట్‌ లీడర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నా పెద్దవారిని గౌరవించే విషయంలో సంకోచించేవారు కారని, ఆయన జీవితం నేటి యువతరానికి ఆచరణీయమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. 

చెన్నైలో  ‘డాక్టర్‌ వీఎల్‌ దత్‌ – గ్లింప్సెస్‌ ఆఫ్‌ ఎ పయనీర్స్‌ లైఫ్‌ జర్నీ’ అనే ఆంగ్ల పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ  పారిశ్రామికవేత్తలు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబ జీవన విధానాలను, వారి విధుల నిర్వహణను తెలుసుకుని వారిని ప్రోత్సహించే విధానాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

వీఎల్‌ దత్‌ ప్రజల మనిషి అని, పనిచేసే చోట ప్రతి ఒక్కరికీ సమానమైన ప్రాధాన్యత ఇచ్చేవారని, కుటుంబ సభ్యులతోనూ అదే తీరులో వ్యవహరించేవారని ఆయన కొనియాడారు. దత్‌ జీవితాన్ని పుస్తకంగా తీసుకురావటం అభినందనీయమని చెప్పారు. 

ఈ పుస్తకం ఓ మంచి వాణిజ్యవేత్త జీవితంలోని మానవత్వపు కోణాన్ని ఆవిష్కరిస్తుందని పేర్కొన్నారు.  వీఎల్‌ దత్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, తమ ఇరువురి మధ్య క్రీడలు మొదలుకుని ఎన్నో విషయాల్లో సారూప్యత వుండేదని తెలిపారు. 

వివిధ స్వచ్చంద సంస్థల ద్వారా సామాజికాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, విద్యాసంస్థల నిర్మాణానికి, వైద్య వసతుల కల్పనకు తన వంతు సహాయాన్ని అందించారని చెప్పారు. దత్‌ జీవిత విశేషాలను పుస్తకరూపంలో అందుబాటలోకి తీసుకు వచ్చిన ఆయన సతీమణి ఇందిరాదత్‌, ఆమె ఆలోచలనకు అక్షరూపం కల్పించిన యు  ఆత్రేయ శర్మ, కుమారి అంబికా అనంత్‌ను ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి అభినందించారు.