ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు విరాళాలు సమర్పించుకొని దివ్యక్షేత్రాలలో ఒక్కటి తిరుమల. సాధారణ భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం లభించేటట్లు చేయడం పట్ల దృష్టి సారింపవలసిన టిటిడి పాలక వర్గం దానిని ఒక వ్యాపార సంస్థగా మారుస్తుందా? అనే అనుమానాలు ఈ మధ్య కలుగుతున్నాయి.
పాలకవర్గం సభ్యుల సంఖ్యను వివిధ పేర్లతో రెండు రేట్లు పెంచి, మందులో తిరుమల పవిత్రత పట్ల ఆసక్తి గలవారికి కాకుండా, పారిశ్రామికవేత్తలు, సంపన్నులకు వ్యాపారలావాదేవీల మాదిరిగా పెద్ద పీట వేయడం తెలిసిందే. ఈ మధ్యనే అగర్బత్తిలను అమ్మే వ్యాపారం ప్రారంభించడం కొన్ని వివాదాలకు దారితీసింది. తాజాగా సేవా టిక్కెట్లను కోట్ల రూపాయలకు అమ్మబోవడం కలకలం సృష్టిస్తున్నది.
తిరుమల వేంకటేశ్వరస్వామి ఉదయాస్తమాన సేవా టికెట్ ధర సాధారణ రోజుల్లో అయితే కోటి రూపాయలు. శుక్రవారం అభిషేకం, మేల్ఛాట్ వస్త్రం సేవలు ఉన్న క్రమంలో టికెట్ ధర రూ.1.5 కోట్లుగా టిటిడి నిర్ణయించడం దుమారం రేపుతున్నది. అంటే కోట్ల రూపాయాలు పెట్టగలిగిన వారికి మాత్రమే ఈ సేవ పరిమితం కానున్నది. బహుశా మొత్తం భారత దేశంలో ఏ దేవాలయంలో కూడా ఇటువంటి కార్పొరేట్ సేవలు దైవంకు ఉన్నట్లు లేదు.
తిరుపతిలోని చిన్నపిల్లల హృదయాలయాన్ని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చేందుకు టీటీడీ స్థలాన్ని గుర్తించింది. శాశ్వత ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడతామని, దీనికోసం ఎస్వీ ప్రాణదానం ట్రస్టు ద్వారా విరాళాలు అందించే దాతలకు ఉదయాస్తమాన సేవా టికెట్లు కేటాయించాలని ఈ నెల 11వ తేదీ జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా ఈ టికెట్లు కలిగిన భక్తులు ఏడాదిలో ఒక్కరోజు శ్రీవారి ఆలయంలో జరిగే సుప్రభాతం సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. గతంలో సాధారణ రోజులకు సంబంధించి ఒక టికెట్ (ఆరుగురికి) రూ.లక్ష, శుక్రవారం రోజుకు రూ.5 లక్షలకు విక్రయించేవారు. ఈ క్రమంలో ఉదయాస్తమాన సేవా టికెట్లు పొందిన భక్తుల సంఖ్య అధికం కావడంతో 2006 నుంచి విక్రయాలను నిలిపివేశారు.
అయితే వివిధ కారణాలతో కొన్ని టికెట్లు రద్దు కావడంతో పాటు మరికొన్ని కాలపరిమితి పూర్తికావడంతో దాదాపు 531 టికెట్ల వరకూ ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేయాలని నిర్ణయించిన ధర్మకర్తల మండలి వాటి ధరను రూ.కోటిగా, శుక్రవారం రూ.1.5 కోట్లుగా నిర్ణయించారు.
ఈ టికెట్లు కొనుగోలు చేసే భక్తులు దాదాపు 25 ఏళ్ల పాటు ఏడాదిలో ఒక్కరోజు వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు జరిగే ఆర్జితసేవల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే టికెట్ల కేటాయింపులో పారదర్శకత తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఓ యాప్ను రూపొందించనున్నట్టు తెలుస్తోంది.
ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్ కింద ఈ టికెట్లను కేటాయించనున్నారు. వీటి ద్వారా టీటీడీకి దాదాపు రూ.600 కోట్లు లభించనుంది. ఈ మొత్తంతో చిన్నపిల్లల హృదయాలయ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. కాకపోతే ఈ అంశాలన్నింటిపై టీటీడీ అధికార ప్రకటన చేయాల్సి ఉంది.
More Stories
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 23 శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
65 ఏళ్లలో 7.81 శాతం తగ్గిపోయిన హిందూ జనాభా
పద్మ విభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి