కరోనా వైరస్‌ ఇంకా ముగియలేదు

కరోనా వైరస్‌ ఇంకా ముగియలేదని, దీన్ని ఎదుర్కోవడానికి ప్రపంచం ప్రజారోగ్య సాధనాలను సమర్ధవంతంగా ఉపయోగించాల్సిన అవరముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) చీఫ్‌ టెడ్రోస్‌ అథనామ్‌ చెప్పారు.   ‘ప్రపంచం కరోనాను అంతం చేయాలనుకున్నప్పుడే మహమ్మారి కనుమరుగౌతుంది. అది మన చేతుల్లో ఉంది. సమర్థవంతమైన ప్రజారోగ్య సాధనాలు, సమర్థవంతమైన వైద్య సాధనాలు మన దగ్గర ఉన్నాయి’ అని పేర్కొన్నారు. 
 
కానీ ప్రపంచం ఆ సాధనాలను సరిగ్గా వినియోగించడం లేదు. వారానికి దాదాపుగా 50 వేల మంది చనిపోతున్నారు. మహమ్మారి ఇంకా ముగిసిపోలేదని బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సులో ఆందోళన వ్యక్తం చేశారు. కోవాక్స్‌ మెకానిజం, ఆఫ్రికన్‌ వాక్సిన్‌ ట్రస్ట్‌ (ఎవిఎటి)లో చురుగ్గా పాల్గొనేందుకు జి 20 దేశాలు తమ జనాభాలో 40 శాతం మందికి వ్యాక్సిన్లు అందించాలని కోరారు. 
 
డబ్ల్యుహెచ్‌ఒ వెబ్‌సైట్‌ తెలిపిన ప్రకారం.. ప్రపంచంలోని ప్రతి దేశానికి కోవిడ్‌-19 పరీక్షలు, చికిత్సలు, వ్యాక్సిన్లకు సమానమైన ప్రాధాన్యత కల్పించడం, అభివృద్ధి, ఉత్పత్తిని వేగవంతం చేయడమే కోవాక్స్‌, యాక్ట్‌ లక్ష్యమని పేర్కొంది. 
 
ప్రపంచ దేశాలకు అందించేందుకు 8 బిలియన్ల కోవిడ్‌-19 వ్యాక్సిన్లను సేకరించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జి-20 దేశాలకు ఐరాస జనరల్‌ ఆంటోనియా గుటెరస్‌ పిలుపునిచ్చిన తర్వాత అథనామ్‌ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.  ఇలా ఉండగా, కరోనా పుట్టిన ప్రదేశమైన చైనాలో కరోనా వైరస్‌ డెల్టా వెరియంట్‌ విజృంభిస్తోంది.
ఈనెల 17వ తేదీ నుండి ఇప్పటి వరకు 11 ప్రావిన్స్‌లకు ఈ డెల్టా వెరియంట్‌ విస్తరించినట్లు స్థానిక వైద్య అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణీకుల కారణంగానే ఈ వేరియంట్‌ చైనాలోకి ప్రవేశించిందని చెప్పారు. కరోనా  ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీ పరిస్థితులను విధించినట్లు తెలిపారు. 
గాన్సు ప్రొవిన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజా రవాణాను నిషేధించారు. శనివారం నాడు మొత్తం ఏడు ప్రావిన్సిలలో 26 కేసులు నమోదైనట్లు స్థానిక వైద్య అధికారులు తెలిపారు. బీజింగ్‌లోనూ కేసులు బయటపడ్డాయి. అక్కడ కూడా వైరస్‌ విస్తరిస్తోంది. దీంతో కరోనా ప్రభావిత ప్రాంతాల నుండి బీజింగ్‌కు రాకపోకలను నిషేధించారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 31వ తేదీన బీజింగ్‌లో నిర్వహించాల్సిన మారధాన్‌ను రద్దు చేశారు.