బాంగ్లాదేశ్ లో ఖురాన్‌కు అపచారం చేసిన ముస్లిం గుర్తింపు

ఖురాన్‌కు అపచారం చేసి, హిందువులపై హింసాత్మక దాడులకు కారకుడైన వ్యక్తిని గుర్తించినట్లు బంగ్లాదేశ్ పోలీసులు ప్రకటించారు. కొమిల నగర పోలీస్ సూపరింటెండెంట్ ఫరూఖ్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ, నగరంలోని సుజ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న ఇక్బాల్ హుస్సేన్ ఖురాన్‌ను దుర్గా పూజ మండపంలో పెట్టినట్లు చెప్పారు.

ఇక్బాల్ హుస్సేన్ (35) స్థానిక మసీదులోని ఖురాన్‌ను తీసుకుని, నడుచుకుంటూ వెళ్లి దుర్గా పూజ మండపంలో పెట్టినట్లు, ఈ మండపం నుంచి హనుమంతుని విగ్రహాన్ని పట్టుకెళ్ళినట్లు  సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిందని ఢాకా మీడియా తెలిపింది. దుర్గా పూజ మండపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించినపుడు ఈ విషయం వెల్లడైందని తెలిపింది. ఇతనిని ఇంకా అరెస్టు చేయలేదని పేర్కొంది. 

హిందువులే ఖురాన్ కు అపచారం కలిగించారని సోషల్ మీడియాలో కధనాలు వ్యాప్తి కావడంతో  బంగ్లాదేశ్‌లో వారం రోజులకు పైగా దేవాయాలు, హిందువులపై దాడులు తీవ్రంగా జరుగుతున్నాయి. దుర్గా పూజ మండపంలో ఖురాన్‌ ఉన్నట్లు కనిపిస్తున్న ఓ పోస్ట్ సోషల్ మీడియాలో కనిపించడంతో పెద్ద ఎత్తున హింసాకాండ జరిగింది.

గత ఆదివారం ముష్కర మూకలు హిందువులకు చెందిన 66 ఇళ్లను ధ్వంసం చేసి, 20 ఇళ్ళకు నిప్పు పెట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో హిందువులపైనా, హిందూ దేవాలయాలపైనా జరిగిన దాడులకు సంబంధించిన కేసుల్లో దాదాపు 450 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొమిలలో జరిగిన దాడులతో ప్రమేయం ఉందనే అనుమానంతో 41 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. వీరిలో నలుగురు హుస్సేన్ సహచరులని తెలిపారు. ముస్లిం మెజారిటీ బంగ్లాదేశ్‌లో హిందువులు సుమారు 10 శాతం మంది ఉన్నారు.