టపాసులు నిషేధించి చిరు వ్యాపారుల కడుపులు కొట్టకండి 

టపాసులు నిషేధించి చిరు వ్యాపారుల కడుపులు కొట్టకండి 

దీపావళి సందర్భంగా టపాసుల అమ్మకాలను మూకుమ్మడిగా నిషేధిస్తూ చిరు వ్యాపారుల కడుపులు కొట్టవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.బాణాసంచా విక్రయాలపై మూకుమ్మడి నిషేధం సహేతుకం కాదని స్పష్టం చేస్తూ నిషేధంపై పునరాలోచించాలని ఆయన కోరారు. 

 టపాసుల తయారీపై దాదాపు 8 లక్షల మంది ఆధారపడి ఉన్నారని పేర్కొంటూ  వారి పొట్ట కొట్టొద్దని ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, హర్యానా ముఖ్యమంత్రులను ఆయన కోరారు. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్ నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి టపాసులను విక్రయించవచ్చని ఆయన స్పష్టం చేశారు. 

కరోనా మహమ్మారి దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగాన్ని దారుణంగా దెబ్బతీసిందని, తమిళనాడు ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపించిందని ఆయన పేర్కొన్నారు. శివకాశిలోని బాణసంచా పరిశ్రమ రాష్ట్రంలోని ముఖ్యమైన పరిశ్రమల్లో ఒకటని, దానిపై ఆధారపడి సుమారు 8 లక్షల మంది జీవిస్తున్నారని తెలిపారు. ఇంతమంది ఆధారపడుతున్న దేశంలోనే అతిపెద్ద పరిశ్రమ ఇదేనని గుర్తు చేశారు. 

వాయుకాలుష్య కారణంతో ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని తనకు తెలుసని, కానీ సుప్రీంకోర్టు కొన్ని ప్రత్యేకమైన బాణసంచాపైనే నిషేధం విధించిందని ఆయన గుర్తు చేశారు.  గ్రీన్ క్రాకర్స్ ఇప్పుడు తయారు చేస్తున్నారని, అవి తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయని స్టాలిన్ త్లెఇపారు . కాబట్టి టపాసులపై నిషేధం సహేతుకం కాదని చెబుతూ  ఇతర దేశాల్లోనూ ఎక్కడా నిషేధం లేదని వివరించారు.

ఇలాంటి నిషేధాన్నే ఇతర రాష్ట్రాలు కూడా విధించాయంటే మొత్తం పరిశ్రమనే మూసుకోవాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే జరిగితే 8 లక్షల మంది జీవనాధారం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేయసారు. కాబట్టి మూకుమ్మడి నిషేధంపై పునారాలోచించాలని మనస్పూర్తిగా కోరుతున్నట్టు స్టాలిన్ తెలిపారు