విద్యుత్ వాహనాలలో చైనాకు ధీటుగా భారత్ 

రానున్న కాలంలో ప్రపంచాన్ని ముంచేయనున్న విద్యుత్ వాహనాల అమ్మకాలలో గత ఏడాది కాలంగా భారత్ వేగంగా దూసుకు వెడుతున్నది. ఈ రంగంలో చైనాకు ధీటుగా భారత్ ముందుకు వెడుతున్నది. రానున్న సంవత్సరాలలో విద్యుత్ వాహనాలకు భారత్ ప్రధాన మార్కెట్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఆరు నెలల్లో విద్యుత్ వాహనాల డిమాండ్ దేశంలో 15 రేట్లు పెరగవచ్చని భావిస్తున్నారు. 

పెరుగుతున్న ఇంధన ధరలు, విద్యుత్త వాహనాల ధరలు తక్కువగా ఉండడం, కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సాహం ఇస్తుండడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన పెరగడంతో ఆకస్మికంగా వీటికి దేశంలో మార్కెట్ అవకాశాలు పెరుగుతున్నాయి.

చమురు ధరలు తగ్గినప్పటికీ ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఇంధన ధరలు పెరిగాయి. గ్యాసోలిన్, డీజిల్ రెండింటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల పెరుగుదల కారణంగా ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దీంతో రవాణా, షిప్పింగ్ రంగం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఇంధన ధరల పెరుగుదలతో చాలా మంది విద్యుత్  వాహనాల కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

2020లో ప్రపంచం కరోనా మహమ్మారితో పోరాడుతున్నప్పటికీ అంతర్జాతీయ ఇంధన సంస్థ 2021 గ్లోబల్ ఈవీ అవుట్ లుక్ నివేదిక ప్రకారం భారతదేశంలో విద్యుత్  బస్సు రిజిస్ట్రేషన్లు 34 శాతం పెరిగాయి. అదే సమయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు రెండూ ఈవిలపై భారీగా ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి. 

గత కొద్ది నెలల నుంచి ఈవీ అమ్మకాల్లో చైనాతో పోటీగా భారత్ దూసుకెళ్తుంది. విదేశీ ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం కోసం, దేశంలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈవీ రంగాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం భారత వాణిజ్య ఈవీ రంగం తక్కువగా ఉన్నప్పటికీ,  త్వరలోనే విస్తృతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రపంచ EV30@30 ప్రచారం కోసం సంతకం చేసిన కొన్ని దేశాలలో భారతదేశం ఒకటి. ఈ దేశాలు 2030 నాటికి ప్రతి 20 కొత్త కార్ల అమ్మకాలలో 3 విద్యుత్  వాహనాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందుకే. ఈ ఏడాదిలోనే భారత దేశ మంత్రివర్గం ఐదు సంవత్సరాల వ్యవధిలో సుమారు 3.5 బిలియన్ డాలర్ల ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించింది. 

ఇది ఈవిల (బ్యాటరీ, ఫ్యూయల్ సెల్ వాహనాలు రెండూ) అలాగే దేశీయ డ్రోన్ల తయారీకి వెళుతుంది. ఈ నిర్ణయం ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో భారతదేశం పోటీగా మారడానికి, కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి సహాయపడుతుందని భారత ప్రభుత్వం భావిస్తోంది.