
భాగ్యనగరానికి దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి శరవేగంగా రాకపోకలు సాగించే సమయం త్వరలో రానున్నది. ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ రైలు ప్రారంభించేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) ప్రతిపాదించింది.
ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి ముంబైకి రైలులో కేవలం మూడున్న గంటల్లో చేరుకోవచ్చు. దాంతో 9.5 గంటల సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం రెండు నగరాల మధ్య నడుస్తున్న అత్యంత వేగవంతమైన రైలు హుస్సేన్సాగర్ ఎక్స్ప్రెస్లో వెళ్లినా 14 గంటల సమయం పడుతున్నది.
ఈ ప్రాజెక్టును దాదాపు రూ.లక్ష కోట్ల వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో నిర్మిస్తారు. నవంబర్ 5న ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అచల్ ఖేర్ తెలిపారు. అదే నెల 18న టెండర్లు తెరిచే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించేందుకు ఇటీవలే టెండర్లు పిలిచారు.
ముంబై-హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును ముందుగా తెలంగాణలోని జహీరాబాద్ను లింక్ చేస్తూ నిర్మించాలని అనుకున్నారు. ఆ తర్వాత దూరం, ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించేందుకు వికారాబాద్ మీదుగా నిర్మించేందుకు సర్వే చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ముంబై-పుణె-జహీరాబాద్ మీదుగా హైదరాబాద్ వరకు 780 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
తాజాగా ముంబై-పుణె-గుల్బర్గా-తాండూరు-వికారాబాద్ మీదుగా హైదరాబాద్కు అలైన్మెంట్ మార్చనుండటంతో 649.76 కిలోమీటర్లకు తగ్గుతుంది. ముంబైలో భారీ రైల్వే టెర్మినల్ నిర్మాణానికి స్థలం లేనందున నవీముంబైలో నిర్మించాలని ప్రతిపాదించారు. అక్కడి విమానాశ్రయ స్థలంలో భూగర్భంలో రైల్వే టెర్మినల్ నిర్మించాలని ఆలోచిస్తున్నామని ఎన్హెచ్ఎస్ఆర్సీ అధికారులు తెలిపారు.
డీపీఆర్ సిద్ధమైన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటిలోపు పూర్తవుతుందనేదానిపై స్పష్టత రానున్నది. ప్రాజెక్టుకోసం కొత్తగా రైల్వే ట్రాక్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రాక్ బుల్లెట్ రైలు వేగాన్ని తట్టుకోలేదు. కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా 8 బుల్లెట్ రైలు కారిడార్లను ప్రతిపాదించింది. వీటిలో నాలుగింటికి ముంబైతో లింకు ఉన్నది. ముంబై-అహ్మదాబాద్ కారిడార్ను 2028లోపు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.
మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన గ్రామస్తులకు ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రతిపాదన గురించి సోమవారం అధికారికంగా తెలిపారు. ప్రతిపాదిత ముంబై -హైదరాబాద్ హై స్పీడ్ రైలు లేదా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు సాధాసాధ్యాలపై ఇప్పుడు రైల్వే విభాగం సర్వే చేపట్టింది. ఇది కార్యరూపం దాలిస్తే భూముల స్వాధీనం ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు గ్రామస్తులకు ముందుగానే తెలియచేశారు.
ఈ బుల్లెట్ ట్రైన్ నిర్వహణకు సర్వే నిర్వహించి తరువాత దీనికి అనుమతి దక్కితే ముంబైపుణే హైదరాబాద్లు అత్యంత వేగవంతపు రైలు ప్రయాణాల పరిధిలోకి వస్తాయి. మహారాష్ట్ర, తెలంగాణల్లోని 11 నిర్ణీత స్టేషన్ల మీదుగా ఈ రైలు వెళ్లుతుందని, ఇప్పుడిది సర్వే దశలో ఉందని అధికారులు తెలిపారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చైనాపై ట్రంప్ 100 శాతం అదనపు సుంకాలు
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం