దేశంలో 600 వైద్య కళాశాలలు అవసరం

ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (పిపిపి) పద్ధతిలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి జరగాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. దేశానికి 600 వైద్య కళాశాలలు, 50 ఎయిమ్స్ తరహా వైద్య సంస్థలు, 200 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అవసరం ఉందని ఆయన తెలిపారు. 

మహారాష్ట్రలోని సతారా జిల్లా కరడ్ నగరంలో కరోనా  వారియర్స్‌కు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ వైద్య సౌకర్యాలు కల్పించేందుకు సహకార రంగం కూడా ముందుకు రావాలని కోరారు. ఒకసారి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చల సందర్భంగా తాను దేశంలో వెంటిలేటర్ల కొరతను ప్రస్తావించానని ఆయన తెలిపారు.

దేశంలో ఎన్ని వెంటిలేటర్లు ఉన్నాయని ప్రధాని అడగగా సుమారు 2.5 లక్షలు ఉండవచ్చని తాను చెప్పానని, అయితే దేశంలో కరోనా వైరస్ సంక్షోభం ప్రబలిన తొలినాళ్లలో కేవలం 13,000 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయని ప్రధాని తనకు చెప్పారని ఆయన వివరించారు. ఆ సమయంలో దేశంలో ఆక్సిజన్, పడకలు, ఇతర వైద్య సౌకర్యాలకు తీవ్ర కొరత ఉందని గడ్కరీ చెప్పారు. 

ప్రభుత్వ నిర్వహణలోని ఆసుపత్రులతోపాటు సహకార, ప్రైవేట్ రంగంలోని ఆసుపత్రులు సైతం వైద్య సౌకర్యాల మెరుగుదలకు అద్భుతమైన సేవలందచేశాయని గడ్కరీ ప్రశంసించారు. ప్రతి తహసిల్‌లో కనీసం ఒక పశు వైద్యశాలను కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. 

కొత్తగా 22 ఎయిమ్స్ వైద్యశాలలు

కాగా,  ఆరోగ్యరంగంలో ఎయిమ్స్ లైట్‌హౌజ్ లాంటిదని, ప్రజలకు ఎయిమ్స్‌పై నమ్మకం బాగా ఉన్నందున అన్ని రాష్ట్రాలు ఎయిమ్స్ వైద్యశాలల కోసం పోటీ పడుతున్నాయని, ఈ కారణంగా దేశ వ్యాప్తంగా 22 ఎయిమ్స్ వైద్యశాలలు ప్రారంభించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ వెల్లడించారు. 
 
ఎయిమ్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ హెల్తీ ఇండియా విజన్‌తో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, ఆరోగ్యబడ్జెట్‌ను రూ.2.40 లక్షల కోట్లకు పెంచినట్టు మంత్రి తెలిపారు. ఎయిమ్స్ డెరెక్టర్ రణ్‌దీప్ గులేరియా మాట్లాడుతూ కొవిడ్ తర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోడానికి అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నట్టు చెప్పారు. గత మూడేళ్లలో సాధించిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ లోని ఎయిమ్స్ మెడికల్ కాలేజీ కి సెంటర్ వన్ ర్యాంకు ఇచ్చినట్టు చెప్పారు.