వైసీపీది దౌర్భాగ్యపు, దిక్కుమాలిన, దాష్టీక పాలన 

వైసీపీది దౌర్భాగ్యపు, దిక్కుమాలిన, దాష్టీక పాలన 
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ  వైసీపీది దౌర్భాగ్యపు, దిక్కుమాలిన, దాష్టీక పాలన అంటూ  జనసేన అధినేత పవన్ కళ్యాణ్  మండిపడ్డారు. వారి కుట్రలను దీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకూ వైసీపీ అరాచకాలు చేస్తుంటే.. అధికార యంత్రాంగం చోద్యం చూసిందని ధ్వజమెత్తారు.
 
ఎన్ని ప్రతికూల పరిస్థితులు సృష్టించినా.. పరిషత్ ఎన్నికల్లో బలంగా పోరాడి 25.2% ఓట్లు సాధించామని పేర్కొంటూ జనసేన విజయ ప్రస్థానం బిందువుగా మొదలై సింధువుగా మారుతోందని భరోసా వ్యక్తం చేసారు. వైసీపీ దాష్టీక పాలనను ఎదుర్కోవాలని బలంగా నిర్ణయించుకున్నామని వెల్లదించారు.
ఈ విషయమై ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో తమ పార్టీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని తెలిపారు. ఇక నుంచి ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి ప్రజల పక్షాన నిలబడతామని చెప్పారు.
 ప్రతిపక్ష నాయకులను ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయకుండా బెదిరింపులు, దాడులకు పాల్పడ్డారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు బలంగా నిలిచారని సంతోషం ప్రకటించారు. ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమై.. పంచాయతీ ఎన్నికల్లో 1,209 సర్పంచ్‌లు, 1,576 ఉప సర్పంచ్‌లు, 4,456 వార్డు సభ్యులు గెలిచామని గుర్తు చేశారు.
 అలాగే మొన్న జరిగిన పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసింది 1200 స్థానాలయితే.. గెలుపొందింది 177. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 24 శాతం పైచిలుకు ఓట్ల శాతం సాధిస్తే,  పరిషత్ ఎన్నికల్లో 25.2 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఫలితాలు గొప్ప మార్పునకు సూచనగా భావిస్తున్నామని వివరించారు.

‘‘ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ఓటు వేయకపోతే పింఛన్ నిలిపేస్తాం, రేషన్ కట్ చేయిస్తాం, ఇళ్ల స్థలాలు నిలిపివేస్తామంటూ వలంటీర్లతో బెదిరించారు. ఇతర పార్టీల అభ్యర్థుల ఆర్థిక మూలలపై దాడి చేశారు. మరికొన్నిచోట్ల స్వయంగా మంత్రులే ఎన్నికల ప్రక్రియను నడిపించినా.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తూ ఉండిపోయింది” అని పవన్ కళ్యాణ్ ద్వామెత్తారు. 

అన్ని చోట్ల ఎంపీటీసీ అభ్యర్థులు బరిలో లేకపోవడం.. జెడ్పీటీసీ అభ్యర్థులకు ప్రతికూలంగా మారింది. అలాగే ఎన్నికల నాటికి జనసేన పూర్తిస్థాయి కమిటీలు లేకపోవడం కూడా చిన్న లోటుగా అనిపించింది. పోలీసులే బలవంతంగా విత్‌డ్రా చేయించారని వివరించారు. పైగా, ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన పరిస్థితులు వేరని, ఈ రోజు పరిస్థితులు వేరని చెబుతూ ఇప్పుడుగానీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఫలితాలు వేరేవిధంగా ఉండేవని తెలిపారు.