పంజాబ్లో తప్పిన భారీ ఉగ్రదాడి, ముగ్గురు అరెస్ట్‌

పంజాబ్‌ పోలీసులు భారీ ఉగ్ర దాడి జరుగకుండా నివారించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తరణ్‌ తరణ్‌ జిల్లాలో పెద్ద ఉగ్రదాడి జరిపేందుకు ఈ ముగ్గురు ప్రణాళిక వేసినట్లు పోలీసులు గుర్తించారు.

పంజాబ్‌ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ఉగ్రదాడి తప్పింది. బుధవారం అర్థరాత్రి కారులో వచ్చిన ముగ్గురు దుండగులను తరణ్‌ తరణ్‌ జిల్లాలోని భగవాన్ పురా గ్రామం దగ్గర చుట్టుముట్టారు. వారి వద్ద .9 మిమీ పిస్టల్, 11 లైవ్ కాట్రిడ్జ్‌లు, హ్యాండ్ గ్రెనేడ్, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

అనుమానిత వ్యక్తులను ఇదే రాష్ట్రంలోని మోగా జిల్లాకు చెందిన కమల్‌ప్రీత్ సింగ్ మన్, కుల్విందర్ సింగ్, కన్వర్ పాల్ సింగ్‌గా గుర్తించారు. ఈ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టి ఇంకా సెర్చ్‌ చేస్తున్నారు. ఈ నెల మొదట్లో పంజాబ్‌లోని ఇండో-పాక్ సరిహద్దు నుంచి ‘టిఫిన్ బాక్స్ ఐఈడీ’ స్వాధీనం చేసుకున్నారు.

ఆగస్ట్‌ నెల ఆరంభంలో అమృత్‌సర్ రూరల్ పోలీసులు లోపోకేలోని దలేకే గ్రామం నుంచి ఐదు హ్యాండ్ గ్రెనేడ్‌లు, టిఫిన్ బాక్స్ ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో అనేక పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం భద్రతా హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాలైన బియాస్, నంగల్, బటాలా, తరణ్‌ తరణ్‌తో పాటు అనేక చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నారు.

ముగ్గురు ఉగ్రవాదుల కాల్చివేత

 కాగా, జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. యూరిలోని రాంపూర్ సెక్టార్‌లో నియంత్రణ రేఖను దాటి భారత్‌లోకి వచ్చేందుకు వీరు యత్నించారు. మొత్తం ఆరుగురు అక్రమంగా భారత్‌లోకి చొరబడేందుకు యత్నించగా ముగ్గురు హతమయ్యారు. మరో ముగ్గురి కోసం భారత బలగాలు గాలిస్తున్నాయి. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 5 ఏకే 47 రైఫిళ్లు, 8 పిస్టళ్లు, 70 గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.