ఉగ్రవాదానికి మాతృమూర్తి కాంగ్రెస్ పార్టీ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. శ్రీరాముడిపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఆ పార్టీ కించ పరిచిందని ఆరోపించారు. ఆదివారం ఆయన కుషినగర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తూ వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదానికి మాతృమూర్తి అని పేర్కొంటూ దేశానికి నష్టం కలిగిస్తున్న వారిని సహించాల్సిన అవసరం లేదని స్పష్ట పరిచారు. కాంగ్రెస్ వ్యాధులు తీసుకొస్తుందని, శ్రీరాముడి పట్ల విశ్వాసాన్ని కించపరుస్తుందని, మాఫియాకు షెల్టర్ ఇస్తుందని ధ్వజమెత్తారు. కానీ ప్రజలకు అయిన గాయాలను బీజేపీ నయం చేస్తుందని, వారి కష్టాలు పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు.
బీజేపీ ఉన్న చోటే ప్రతి ఒక్కరికీ గౌరవం ఉంటుంది అని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. వ్యాధులు, నిరుద్యోగం, మాఫియా రాజ్యం, అవినీతి కాంగ్రెస్ పార్టీ పుణ్యమే అని తెలిపారు. ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాలు రాష్ట్రానికి చేసిందేమిటని ప్రశ్నించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బుజ్జగింపు రాజకీయాలకు చోటు లేదని స్పష్టం చేశారు.
2017కు ముందు ప్రతి ఒక్కరికీ రేషన్ సరుకులు అందేవా? అని నిలదీశారు. పాలకులకు జై కొట్టిన వారికే రేషన్ సరుకులు ఇచ్చేవారు అని ఆరోపణలు గుప్పించారు. తాలిబన్ అనుకూల, కుల, వారసత్వ రాజకీయాలను ఉత్తరప్రదేశ్ ప్రజలు సహించబోరని యోగి ఆదిత్య నాధ్ స్పష్టం చేశారు.
బుజ్జగింపు రాజకీయాలకు, అవినీతికి ప్రతిపక్ష పార్టీలు పెట్టింది పేరని మండిపడ్డారు. ఈ దేశాన్ని ముందు బ్రిటిష్ వాళ్లు లూటీ చేయగా, తర్వాత ఆ పని కాంగ్రెస్ పార్టీ చేసిందని ధ్వజమెత్తారు. రాముడిపై నెహ్రూకు నమ్మకం లేదని, సాధువులపై ఇందిరాజీ కాల్పులు జరిపించారని, శ్రీరాముడి ఉనికిని సోనియాజీ అంగీకరించరని ఆరోపించారు.
More Stories
ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు
కేజ్రీవాల్ జైలులో పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు