బీజేపీ సీనియర్ నేత ఉత్తరప్రదేశ్ మాజీమంత్రి ఆత్మారామ్ తోమర్ (75) అనుమానాస్పద స్థితిలో మరణించారు. యూపీలోని బాగ్పత్ జిల్లా బారౌత్ బిజ్రాల్ రోడ్లోని ఆయన నివాసంలో గురువారం అర్థరాత్రి చనిపోయి ఉండటం కలకలం రేపింది.
ఈ ఉదయం డ్రైవర్ వెళ్లి చూసే సరికి భాగ్పట్లోని తన ఇంట్లోనే బెడ్రూంలో మంచంపై విగతజీవిగా పడివున్నాడు. ఆయన మెడకు టవల్ చుట్టి వుంది. డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. ముందుగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహం పడివున్న తీరు, మెడకు టవల్ చుట్టి ఉండటం చూసి తర్వాత హత్య కేసుగా మార్చారు.
మెడకు టవల్ చుట్టి ఉండటం, ఆయన స్కార్పియో కారు అదృశ్యం కావడంతో హత్యకు గురయ్యారనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఆత్మారామ్ను టవల్తో గొంతుకు ఉరి బిగించి చంపినట్లు తెలుస్తోంది. పోలీస్ ఉన్నతాధికారులు డాగ్ స్క్వాడ్తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్రాథమిక విచారణ పూర్తిచేసిన పోలీసులు ఆత్మారామ్ కుటుంబానికి బాగా తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆత్మారామ్ స్కార్పియో కారు కూడా కనిపించకపోవడంతో.. తెలిసిన వాళ్లే ఆయనను హత్యచేసి బయటి నుంచి డోర్ లాక్ చేసి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు.
ఆయన ఇంటి తలుపు బయటి నుండి లాక్ చేసి ఉన్నట్టు జిల్లా ఎస్పీ నీరజ్ కుమార్ జడౌన్ తెలిపారు. దగ్గరి బంధువులపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. కాగా ఆత్మారామ్ 1997లో యూపీ మంత్రిగా పనిచేశారు.
More Stories
ఒక్క సీటు కోసం ఉగ్రవాద సంస్థకు కాంగ్రెస్ మద్దతు
ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు