2024 ఒలింపిక్స్‌లో భారత పతకాలు రెట్టింపు కావాలి

టోక్యో ఒలింపిక్స్‌-2020లో భారత అథ్లెట్ల అపూర్వ ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ వచ్చే పారిస్ ఒలింపిక్స్ (2024) నాటికి ఈ పతకాల సంఖ్య రెట్టింపవ్వాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అభిలాష వ్యక్తం చేశారు.  ఇందుకోసం అవసరమైన ప్రోత్సాహభరితమైన వాతావరణాన్ని నిర్మించడంలో క్రీడా సంస్థలతోపాటు ప్రైవేటురంగం అండగా నిలబడాలని, భారతీయ యువశక్తికి మద్దతుగా నిలవాలని ఆయన సూచించారు.

ఎస్.ఆర్.ఎం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తిరుచురాపల్లి ప్రాంగణాన్ని గురువారం చెన్నై రాజ్ భవన్ నుంచి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టోక్యో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు, పారాలింపియన్లు కనబర్చిన ప్రదర్శన యావత్ భారతీయులు గర్వపడేలా ఉందని పేర్కొన్నారు.

పారాలింపియన్లు అద్భుతమైన ప్రదర్శనతో భారతదేశానికి 19 పతకాలు తీసుకురావడం గర్వించదగిన విషయమన్న ఆయన, దివ్యాంగత్వం వ్యక్తిగత, దేశ వికాసానికి అవరోధం కాదనే విషయాన్ని పారాలింపియన్లు మరోసారి  నిరూపించారని కొనియాడారు. టోక్యో ఒలింపిక్స్ లో ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని, భారతీయ యువతకు సరైన ప్రోత్సాహాన్ని, క్రీడా మౌలికవసతులను కల్పిస్తే, మనం ప్రపంచ క్రీడా శక్తిగా నిలవడం కష్టం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 

మరెంతో మంది అవనీ లేఖర్లు, నీరజ్ చోప్రాలు తమ రెక్కలతో పైకి ఎదిగేందుకు సిద్ధంగా ఉన్నారన్న ఆయన, అలాంటి నైపుణ్యాన్ని ఆదిలోనే గుర్తించి దానికి సానబెట్టేందుకు అవసరమైన ప్రోత్సాహభరితమైన వాతావరణాన్ని నిర్మించాని, ఇందులో విద్యాసంస్థల పాత్ర కూడా కీలకమని సూచించారు.

ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉన్న భారతీయ యువతకు విద్యాభ్యాసం తర్వాత సరైన ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రోత్సహించేందుకు అవసరమైన నైపుణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. ఇందుకోసం విద్యాలయాలు-పరిశ్రమల మధ్య పరస్పర సమన్వయం అవసరముందని పేర్కొన్నారు. 

విద్యార్థులు సైతం విద్య ద్వారా తాము సముపార్జించుకున్న జ్ఞానాన్ని,  తమ వ్యక్తిగత బాగుతోపాటు సమాజాభివృద్ధి, దేశాభివృద్ధికి సద్వినియోగం అయ్యేలా శ్రద్ధ పెట్టాలని ఉపరాష్ట్రపతి సూచించారు. తక్షశిల, నలంద, పుష్పగిరి వంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలతో ప్రపంచానికి విద్యాజ్ఞానం అందించిన చరిత్ర భారతదేశానికి ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ, మరోసారి భారతదేశం ‘విశ్వగురు’ పీఠాన్ని అధిరోహించేందుకు, భారతదేశాన్ని విద్యాసాధికారక దేశంగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

నోబుల్ అవార్డు గ్రహీత డాక్టర్ సీవీ రామన్, మాజీ రాష్ట్రపతి-భారత మిసైల్ మేన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఆర్ వెంకట్రామన్ వంటి ఎందరో మహాను భావులు తిరుచిరాపల్లిలోనే విద్యాభ్యాసం చేసారన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేస్తూ, ఎస్ఆర్ఎం విద్యాసంస్థలు ఆ ఘనతను కొనసాగించే దిశగా కృషిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, ఎస్.ఆర్.ఎం. వ్యవస్థాపక కులపతి, పార్లమెంటు సభ్యుడు టీఆర్ పారివెందర్, ఎస్.ఆర్.ఎం.  సంస్థ అధ్యక్షుడు వ్రీ నిరంజన్ కూడా పాల్గొన్నారు.