జావేద్‌ అక్తర్‌కు బిజెపి ఎమ్యెల్యే తీవ్ర హెచ్చరిక

దేశంలో కూడా తాలిబన్ల మాదిరి ఆర్‌ఎస్‌ఎస్‌ తయారైందని బాలీవుడ్‌ ప్రముఖ రచయిత స్కీన్‌ రైటర్‌  జావేద్‌ అక్తర్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జావేద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. 

తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే జావేద్‌ అక్తర్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆయన సినిమాలు దేశంలో విడుదల చేయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆయన రెండు చేతులెత్తి క్షమాపణ చెప్పాలని మహారాష్ట్రలోని ఘట్‌కోపర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ అధికార ప్రతినిధి రామ్‌ కదాం డిమాండ్ చేస్తూ ట్విటర్‌లో ఓ వీడియో విడుదల చేశారు.

‘జావేద్‌ అక్తర్‌ వ్యాఖ్యలు సిగ్గు చేటు. అంతేకాకుండా బాధాకరం. సంఘ్‌, విశ్వ హిందూ పరిషత్‌ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా విశ్వసిస్తున్న కోట్లాదిమందికి ఆ వ్యాఖ్యలు బాధను కలిగించాయి’ అని ఆయన పేర్కొన్నారు. సంఘ్‌కు చెందిన వ్యక్తులు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. ఆయన రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్పేంత వరకు మేం అతడి సినిమాలను భరత గడ్డపై విడుదల చేయనీయం అని రామ్‌ కదాం స్పష్టం చేశారు.

అటువంటి వాఖ్యలు చేసేముందు భారత్ దేశం నేడు ఆయన ఆరోపించిన సైద్ధాంతిక ఆలోచనలు గల వారి పాలనలో ఉన్నదని గుర్తించ వలసి ఉందని రామ్ కదం హితవు చెప్పారు. ఇక్కడ తాలిబన్ల వంటి పాలన ఉండినట్లయితే ఆయన ఈ విధంగా మాట్లాడగలిగేవారా అంటూ ఎద్దేవా చేశారు. 

మాజీ ఎంపీ. ప్రముఖ నటి షబానా అజ్మీ భర్త అక్తర్. వారి పిల్లలు ఫర్మాన్‌ అక్తర్‌ ప్రముఖ నటుడు కాగా‌, కుమార్తె ప్రముఖ నిర్మాత జోయ అక్తర్‌. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలు వరించాయి. జావేద్‌ అక్తర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

`తాలిబన్లు ఏవిధంగా ఇస్లామిక్‌ రాజ్యం కోసం పోరాడుతున్నారో.. అదే మాదిరి ‘హిందూ దేశ స్థాపన కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ పని చేస్తోంది’ అని జావేద్‌ అక్తర్‌ శనివారం ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. జావేద్‌ అక్తర్‌ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు కూడా చేశారు.