సువేందు అధికారికి బెంగాల్ పోలీసులు సమన్లు

సువేందు అధికారికి బెంగాల్ పోలీసులు సమన్లు

2018లో భద్రతా సిబ్బందిలో ఒకరి మరణానికి సంబంధించి పశ్చిమ బెంగాల్‌ బిజెపి నేత సువేందు అధికారికి రాష్ట్ర పోలీసులు ఆదివారం సమన్లు జారీ చేశారు. కాగా బుల్లెట్‌ గాయాలతో అతడు చనిపోయారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం రాష్ట్ర నేర పరిశోధన విభాగం ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. 

భద్రతా సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నాడా లేదా హత్య అన్న కోణంలో ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. బొగ్గు గనుల స్మగ్లింగ్‌ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి తృణమూల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎదట హాజరు కావాలని సమన్లు జారీ అయిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 

అభిషేక్‌తో పాటు ఆయన భార్య రుజిరా బెనర్జీకి కూడా సెప్టెంబర్‌ 1న న్యూఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఇడి నుండి సమన్లు అందాయి. ఈ కేసులో వీరిద్దరే కాకుండా… పశ్చిమ బెంగాల్‌ పోలీసు అధికారులు, రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి మోలోరు ఘటక్‌లను కూడా విచారణకు పిలిచింది.

మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన సువేందు అధికారి  బెంగాల్‌ ఎన్నికలకు ముందు గత ఏడాది నవంబర్‌లో తృణమూల్‌కు గుడ్‌ బై చెప్పి బిజెపి గూటికి చేరారు. అనంతరం మమతా బెనర్జీపై పోటీ చేసి గెలుపొందారు. ఈ గెలుపును సవాలు చేస్తూ ఆమె కోర్టును ఆశ్రయించారు.