నీ బిడ్డ ఓడినా ఎమ్యెల్సీ చేసావు…. నిరుద్యోగులను ఏం చేసావు?

‘‘నీ బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సి ఉద్యోగమిచ్చినవ్. నీ కొడుకు, అల్లుడుకు మంత్రి పదవులిచ్చినవ్. మరి నిరుద్యోగులేం చేశారు? వారి కెందుకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు?” అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోందని మండిపడ్డారు. 

సచివాలయానికి రాకుండా ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్ లాంటి సీఎంను దేశంలో ఎక్కడా చూడలేదని విమర్శించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 4వ రోజు చిలుకూరు చౌరస్తా నుండి మొయినాబాద్ వరకు సంజయ్ తో కలిసి పాదయాత్ర చేసిన నంబిత్ పాత్రో మొయినాబాద్ సభలో ప్రసంగించారు.

దమ్ముంటే పాతబస్తీలో సభ పెట్టాలని నరేంద్ర మోదీకి ఓవైసీ విసిరిన సవాల్ ను బండి సంజయ్ ఆధ్వర్యంలోని బీజేపీ కార్యకర్తలు స్వీకరించి భారీ బహిరంగ సభ పెట్టి సత్తా చూపారని కొనియాడారు. తెలంగాణ కోసం వందలాది మంది బలిదానం చేసుకుంటే ఆ త్యాగాలు వ్రుథా అయ్యియా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒకే కుటుంబం పాలన చేస్తోందని ధ్వజమెత్తారు. 

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకొస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని సంబిత్ పాత్రో ప్రకటించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారంగా జరుపుతానని ప్రకటించి మాట తప్పిన కేసీఆర్ ను గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. 111 జీవో రద్దు ఏమైంది? ఎందుకు రద్దు చేయడం లేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి ? అని ఆయన డిమాండ్ చేశారు. 

2014లో మద్యం ద్వారా రాష్ట్రానికి రూ.4 వేల కోట్ల ఆదాయం వస్తే, నేడు ఆ సంఖ్య ఐదారు రెట్లకు పెరిగి రూ.22 వేల కోట్లకు చేరిందని విస్మయం వ్యక్తం చేశారు. జనాన్ని మందు బానిసలుగా చేసి పాలన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాంటి ప్రభుత్వాన్న ఓడించాల్సిందేనని స్పష్టం చేశారు. ‘‘నీళ్లు-నిధులు-నియామకాలనే నినాదంతో అధికారంలోకి వచ్చి వాటిని తుంగలో తొక్కిండు..’’అని తెలుగులోనే మాట్లాడగా జనం భారీగా స్పందించారు.

కాగా, అమరవీరుల త్యాగాల స్పూర్తితో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకే ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేస్తున్నామని సంజయ్ తెలిపారు.  కేసీఆర్ అవినీతి, నియంత, కుటుంబ పాలనను అంతం చేసేందుకే ఈ యాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు. 

111 జీవోను రద్దు చేస్తానని మాట తప్పిన సీఎం అసలు ఈ జీవోపై ఆయన వైఖరేందో చెప్పాలని నిలదీశారు. ఈ జీవో పరిధిలోనే కేసీఆర్ కు, ఆయన కొడుకుకు, కూతురుకు, అల్లుడుకు ఫాంహౌజ్ లున్నయ్. ఆ పార్టీ నాయకులు రైతుల నుండి అతి తక్కువ ధరకు వేల ఎకరాలు కొని వేల కోట్లు దండుకుంటుండ్రు అంటూ ధ్వజమెత్తారు. 

పేదలకు, దళితులకు, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు మాత్రం ఉండటానికి ఇండ్లు ఇస్తలేడు. కేంద్రం 70 వేల ఇండ్లు గ్రామీణ ప్రాంతాలకు మంజూరు చేస్తే నిర్మించకుండా కేసీఆర్ పిట్టకథలు చెబుతుండు అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇస్తున్న ఉచిత బియ్యం, కరోనా వ్యాక్సిన్, రైతు వేదికలు, స్మశానవాటికలు, రోడ్లు సహా మౌలిక సదుపాయాల నిధులన్నీ కేంద్రానివే అని స్పష్టం చేశారు.

రంగారెడ్డి జిల్లాకు మౌలిక సదుపాయాలు, ఉపాధి హామీ, మరుగుదొడ్లు వంటి వాటి కోసం రూ.1040 కోట్లు కేంద్రం ఇఛ్చిందని సంజయ్ పేర్కొన్నారు. ఈ జిల్లాకు కేసీఆర్ ఏం జేసిండో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ఉద్యోగులకు జీతాలిచ్చేందుకే డబ్బుల్లేని ప్రభుత్వం, ఉన్న ఉద్యోగాలను ఊడబీకుతున్న ప్రభుత్వం, దళిత బంధు వంటి వాటి అబద్దాల హామీలతో ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తోందని విమరసంచారు.