మమతా మేనల్లుడు అభిషేక్ దంపతులకు ఈడీ సమన్లు

కోల్‌ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ, అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుచిరా బెనర్జీకి సమన్లు జారీ చేసింది.  సెప్టెంబర్ 6 న అభిషేక్‌,  సెప్టెంబర్ 1 న రుజీరా  ఈడీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. 

రాష్ట్రంలో జరిగిన బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని అభిషేక్‌ దంపతులను ఆదేశించింది. అలాగే బెనర్జీల తరఫు న్యాయవాది సంజయ్ బసు సెప్టెంబర్ 3 , వీరితోపాటు ఇదే కేసులో  బెంగాల్ పోలీసు ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు  శ్యామ్ సింగ్, జ్ఞవంత్ సింగ్‌లు సెప్టెంబర్ 8 ,9 తేదీల్లోహాజరుకావాలని ఈడీ ఆదేశించింది.

కోట్ల రూపాయల అవినీతి సంబంధించి  సీబీఐ (నవంబర్, 2020) దాఖలు చేసిన కేసు అధారంగా ఈ సమన్లు జారీ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.ఈ కేసుకు సంబంధించిన మరికొంత మందిని కూడా వచ్చే నెలలో హాజరుకావాలని సమన్లు జారీ చేశామన్నారు.

మరోవైపు ఈ ఆరోపణలను ఖండించిన అభిషేక్‌ దర్యాప్తు సంస్థల ద్వారా బీజీపీ సర్కారు తమపై వేధింపులకు పాల్పడుతోందని  అభిషేక్‌ ఆరోపించారు.  రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ పరిణామమని మండిపడ్డారు. కాగా పశ్చిమ బెంగాల్‌లో కునుస్తోరియా, కజోరా ప్రాంతాల్లోని ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌కు(ఈసీఎల్‌) చెందిన బొగ్గు గనుల్లో బొగ్గును అక్రమంగా తవ్వుకొని, స్వాహా చేశారని ఆరోపిస్తూ సీబీఐ కేసు నమోదు చేసింది. 

బొగ్గు అక్రమరవాణాతో పాటు అభిషేక్‌, ఆయన కుటుంబంతో సంబంధం ఉన్న రెండుకంపెనీలు లీప్స్‌ అండ్‌ బౌండ్‌ ప్రై.లి, లీప్స్‌ అండ్‌ బౌండ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ఎల్‌ఎల్‌పిలకు రూ.4.37 కోట్ల నిధులను మళ్లించినట్లు ఈడి తెలిపింది. అభిషేక్‌ తండ్రి అమిత్‌ బెనర్జీ లీప్స్‌ అండ్‌ బౌండ్‌ ప్రై.లి సంస్థలో డైరెక్టర్లలో ఒకరిగా వ్యవహరిస్తున్నారు.

మరో సంస్థలో ఆయన భార్య మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. పలు వ్యాపార సంస్థల యజమానుల నుండి నకిలీ ఒప్పందాల ద్వారా నగదు బదిలీ చేసినట్లు ఈడి వెల్లడించింది. ప్రభుత్వ బగ్గు గనుల్లో దొంగతనాలకు పాల్పడి నగదును అక్రమంగా తమ సంస్థలకు తరలించిందని, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సహకారంతోనే ఇది జరిగిందని ఈడి తెలిపింది.

ఈ వ్యవహారంతో రుచిరా బెనర్జీకి, మరదలు మేనకా గంభీర్‌కు కూడా సంబంధం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. అలాగే అక్రమమైనింగ్‌ వ్యవహారంలో అభిషేక్  ప్రధాన లబ్ధిదారుని గతంలో ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే.