అక్టోబరు 24న దుబాయిలో భారత్ – పాక్ క్రికెట్ పోటీ 

ప్రపంచ పురుషుల టీ20 క్రికెట్ వరల్డ్ కప్ కోసం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య అక్టోబరు 24న దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. సూపర్ 12 గ్రూప్ 2 మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. 

ఆ తర్వాత అక్టోబరు 31న న్యూజిల్యాండ్‌తో, నవంబరు 3న ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ మ్యాచులు ఆడుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ రెండు జట్లూ ఒకే గ్రూపులో ఉండటం అభిమానుల్లో ఉత్సాహం నింపింది. 

అక్టోబర్‌ 17 నుండి నవంబర్‌ 14 వరకు టీ 20 ప్రపంచ కప్‌ జరగనుంది. ఒమన్‌తో పాటు యునైటెడ్‌ అరబ్స్‌ ఎమిరేట్స్‌లో ఈ టోర్నీలను నిర్వహించనున్నారు. నవంబర్‌ 10,11 తేదీల్లో సెమీ ఫైనల్‌, నవంబర్‌ 14న ఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

సూపర్‌-12లో అబుదాబి వేదికగా గ్రూప్‌-1లోని ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా అక్టోబర్‌ 23న బరిలోకి దిగుతాయి. అదే రోజు సాయంత్రం దుబాయ్లో జరిగే మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌లు తలపడతాయి. ఆసీస్‌, ఇంగ్లాండ్‌ పోరు అక్టోబర్‌ 30న ఉండనుంది.