బీజేపీ నేత ఇంటిపై గ్రనేడ్ దాడి, బాలుడి దుర్మరణం

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలో బీజేపీ నేత ఇంటిపై గ్రనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. గురువారం రాత్రి ఘటన జరిగినట్టు పోలీసులు చెప్పారు.

బీజేపీ నేత జస్బీర్ సింగ్, ఆయన తల్లిదండ్రులు, మరో ముగ్గురు బంధువులు గాయపడినట్టు తెలిపారు. 36 ఏళ్ల సింగ్‌తో పాటు ఆయన ఐదుగురు కుటుంబ సభ్యులు గాయపడగా, ఇద్దరిని చికిత్స కోసం జమ్మూ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. మృతుడిని జస్బీర్ మేనల్లుడుగా గుర్తించారు. దాడి విషయం తెలియగానే భద్రతా బలగాలు హుటాహుటిని ఘటనా స్థలికి చేరుకుని అగంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

కాగా, అగంతకుల గ్రెనేడ్ దాడిని బీజేపీ నేత తరుణ్ చగ్ ఖండించారు. పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులే ఈ దాడికి పాల్పడ్డారని, ఇది పరికిపందల చర్య అని అన్నారు. దాడికి బాధ్యులైన వారిని తక్షణం పోలీసులు అరెస్టు చేయాలని బీజేపీ జేకే విభాగం నేత రవీందర్ రైనా డిమాండ్ చేశారు. అమాయక బాలుడి ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారని, ఆరుగురు గాయపడ్డారని, దాడికి పాల్పడిన వారు ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాలని స్పష్టం చేశారు.

రాజకీయ నేతలు టార్గెట్‌గా ఈ దాడులు జరుగుతున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే కశ్మీర్‌లోయలోని అనంతనాగ్‌లో ఒక బీజేపీ నేతను, అతని భార్యను దుండగలు నాలుగు రోజుల క్రితం కాల్చిచంపారు.