
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన జీఎస్ఎల్వీ -ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలమైంది. క్రయోజనిక్ దశలో రాకెట్లో సమస్య ఎదురైంది. జీఎస్ఎల్వీ మిషన్ విఫలమైందని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు.
రాకెట్ మూడో దశలో సాంకేతిక లోపంతో ప్రయోగం విఫలమైందని తెలిపారు. జీఎల్ఎల్వీ ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళ్లింది. నెల్లూరులోని శ్రీహరికోటలో సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు.
రెండు దశలను విజయవంతంగా పూర్తి చేసిన రాకెట్ మూడో దశలో విఫలమైనట్లు కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ తర్వాత మిషన్ విఫలమైనట్లు పేర్కొన్నారు. క్రయోజెనిక్ దశలో సమస్యతో ప్రయోగం విజయవంతం కాలేదని మిషన్ కంట్రోల్ సెంటర్లోని రేంజ్ ఆపరేషన్ డైరెక్టర్ ప్రకటించారు.
ఇదిలా ఉండగా వాస్తవానికి రాకెట్ ప్రయోగం గతేడాది లోనే నిర్వహించాల్సి ఉండగా కరోనా మహమ్మారి, సాంకేతిక సమస్యలతో పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ ద్వారా జీఐశాట్-1 ఉపగ్రహాన్ని భూమికి 36వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది.
దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థ, ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టడం, వాటికి సంబంధించిన ముందస్తు సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇస్రో ఈ మిషన్ను చేపట్టింది.ఈ ఉపగ్రహంలో మల్టీ–స్పెక్ట్రల్ విజబుల్ అండ్ నియర్–ఇన్ఫ్రారెడ్ (6 బాండ్స్), హైపర్–స్పెక్ట్రల్ విజబుల్ అండ్ నియర్–ఇన్ఫ్రారెడ్ (158 బాండ్స్), హైపర్–స్పెక్ట్రల్ షార్ట్ వేవ్–ఇన్ఫ్రారెడ్ (256 బాండ్స్) పేలోడ్స్గా అమర్చారు.
ఈ ఉపగ్రహం భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తు నుంచి అత్యంత పవర్ఫుల్ కెమెరాలతో 50 మీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో భూమిపై జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలను తీసి పంపించేవిధంగా రూపొందించారు. క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం విఫలమైంది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్