పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం చేసిన పోలీసులు

పంజాబ్‌లో పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. అమృత్‌సర్‌లోని దాలిక్‌ గ్రామంలో టిఫిన్‌ బాక్సులో ఉన్న ఐఈడీతో పాటు హ్యాండ్‌ గ్రనేడ్లను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పంజాబ్‌ డీజీపీ దినకర్‌ గుప్తా సోమవారం తెలిపారు.

స్వాతంత్య్ర దినోత్సవానికి ముందుగా వీటిని కనుగొనడం గమనార్హం. పేలుడు పదార్థాలు పాక్‌ నుంచి అంతర్జాతీయ సరిహద్దు మీదుగా డ్రోన్‌ ద్వారా తరలించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, శని, ఆదివారాల్లో ఆ ప్రాంతంలో డ్రోన్‌లు సంచరించాయని తెలిపారు. ఈ సమయంలో ఓ బ్యాగ్‌ను వదిలివెళ్లినట్లు పోలీసులకు సమాచారం వచ్చిందని తెలిపారు.

ఏడు సంచుల్లో, రెండు నుండి మూడు కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు  పోలీసులు తెలిపారు. డ్రోన్స్ ద్వారా పిల్లల టిఫిన్ బాక్సుల్లో బాంబులను అమర్చి భారీ దాడికి పథకం వేసినట్టు పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా వెల్లడించారు.

ఐదు హ్యాండ్ గ్రెనేడ్‌లు, 20 ఐఈడీ బాంబులు, తొమ్మిది  పిస్టల్స్‌, మూడు డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ తెలిపారు.  ఈ ఘటనకు సంబంధించి  20 మందిని అరెస్ట్‌ చేసినట్టు  ప్రకటించారు. దేశంలో, పంజాబ్‌లో పనిచేస్తున్న ఉగ్రవాదశక్తులు స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 15కి ముందు  భారీ దాడులకు ప్లాన్‌ చేసినట్టు తెలిపారు.

అలాగే రెండు కిలోల బరువున్న ఆర్‌డీఎక్స్‌, ఒక స్విచ్‌, రిమోట్‌ కంట్రోల్‌ను గుర్తించారని పేర్కొన్నారు. డ్రోన్ల శబ్దాలను స్థానిక సర్పంచ్‌ పోలీసులకు సమాచారస్తే.. తాము ఎన్‌ఎస్‌జీ చేరవేసినట్లు తెలిపారు. దీనిపై ఎన్‌ఎస్‌జీ దర్యాప్తు చేస్తోందన్నారు. పేలుడు పదార్థాలు ఆత్యాధుకమైనవని.. వాటితో పేలుడు సంభవిస్తే భారీ విధ్వంసం జరిగి ఉండేదని తెలిపారు. 

గత రెండు, మూడు నెలల్లో సరిహద్దుల నుంచి కార్యకలాపాలు పెరిగాయని డీజీపీ చెప్పారు. వాటిపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. పిల్లలు, అమాయక వ్యక్తులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు ప్రయాణ సమయంలో బస్సులు, ఇతర వాహనాల్లో అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

కాగా ఇటీవలికాలంలో  సరిహద్దుల్లో  డ్రోన్ల కదలికలు కలకలం రేపాయి.  ముఖ్యంగా కశ్మీర్‌లో వరుసల కదలికలను నిఘా వర్గాలు పసిట్టాయి. ఈ క్రమంలో కశ్మీర్‌ పోలీసులు  ఒక డ్రోన్‌ను పేల్చివేసిన సంగతి తెలిసిందే. తాజా పరిణామం నేపథ్యంలో దేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పంజాబ్, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ సహా పలు ప్రాంతాల్లో హై అలెర్ట్‌ను ప్రకటించారు.