ముంబై రైల్వేస్టేషన్లు,b అమితాబ్‌ బంగ్లాకు బాంబు బెదిరింపు!

మహారాష్ట్ర ముంబైలోని ప్రముఖ మూడు రైల్వేస్టేషన్లతో పాటు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ బంగ్లాకు బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. నాలుగు చోట్ల బాంబులు పెట్టినట్లు పోలీస్‌ కంట్రోల్‌ రూంకు శుక్రవారం అర్ధరాత్రి ఫోన్‌ రావడంతో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. 

దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు ఆయా ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే, ఇప్పటివరకు తనిఖీలు నిర్వహించగా.. అనుమానాస్పదంగా ఏదీ గుర్తించలేదని చెప్పారు. గుర్తు తెలియని దుండగులు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్లతో పాటు జుహులోని అమితాబ్ బచ్చన్ బంగ్లా వద్ద బాంబులు పెట్టినట్లు కాల్‌ వచ్చిందని ఓ పోలీస్‌ అధికారి తెలిపారు.

బాంబు డిటెక్షన్‌ అండ్‌ డిస్పోజల్‌ స్క్వా్డ్‌, డాగ్‌ స్క్వాడ్‌, స్థానిక పోలీసులు సిబ్బందితో పాటు రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఆయా ప్రదేశాలకు చేరుకొని సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారని పేర్కొన్నారు.

అయితే, అనుమానాస్పద వస్తువులు ఏవీ కనిపించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బాంబు బెదిరింపు ఫోన్‌ కాల్‌ ఆకతాయిల పనిగా అనుమానిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారీ భద్రతను మోహరించి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సదరు అధికారి వివరించారు.