కార్గిల్ యుద్ధంలో అమరవీరులైన భారతదేశం సైనికులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివాళులర్పించారు. బారాముల్లా జిల్లాలోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద సోమవారం ఉదయం రామ్నాథ్ కోవింద్ పుష్ఫగుచ్ఛాలు ఉంచి నివాళుర్పించారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ఆదివారం జమ్ముకశ్మీర్ వచ్చారు.
కార్గిల్ దివస్ నందర్భంగా రాష్ట్రపతి ద్రాస్ వద్ద కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద అమర వీరులకు నివాళులు అర్పించాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించని కారణంగా ఈ కార్యక్రమం రద్దయ్యింది. నేటితో కార్గిల్ విజయ దినోత్సవానికి 22 యేళ్లు పూర్తి అయ్యింది.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతాలో ‘కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా మనం అమర వీరులకు నివాళులు అర్పిస్తున్నాం. వారు మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వారి ధైర్య సాహసాలు మనకు ప్రేరణగా నిలుస్తాయి’ అని పేర్కొన్నారు. ఇదేవిధంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఈరోజు మనం కార్గిల్ అమర వీరుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ వేదికగా కార్గిల్ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కార్గిల్ విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించారు. ఈ ఉదయం లఢఖ్లోని ద్రాస్ సెక్టార్లో గల కార్గిల్ యుద్ధస్మారకం వద్ద, ఢిల్లీలోని జాతీయ యుద్ధస్మారకం వద్ద పలువురు ప్రముఖులు అమరవీరులకు ఘన నివాళులర్పించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్, లఢఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథుర్, లఢఖ్ ఎంపీ జమ్యాంగ్ త్సెరింగ్ నమ్గ్యాల్ కార్గిల్ యుద్ధస్మారకం దగ్గర పుష్పగుచ్ఛాన్నుంచి శ్రద్ధాంజలి ఘటించారు. కార్గిల్ యుద్ధవీరులకు నివాళులు అర్పించారు.
ఇక, భారత రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె, ఎయిర్ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా, నేవీ వైస్ చీఫ్ అడ్మిరల్ జీ అశోక్కుమార్ తదితరులు ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు సమర్పించారు. యుద్ధ స్మారకం దగ్గర పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అంతకుముందు కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద సీడీఎస్ బిపిన్ రావత్ విజయ జ్యోతిని వెలిగించారు.
More Stories
లోక్సభ నాలుగో విడత 5 గంటల వరకు 62.31% ఓటింగ్
కేజ్రీవాల్ను సీఎంగా తొలగించే నిర్ణయం ఎల్జీదే!
ఆప్ ఎంపీ స్వాతిపై కేజ్రీవాల్ పిఎ దాడి!