2020-21 ఆర్ధిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్పై పన్ను వసూళ్లు 88 శాతం పెరిగి రూ 3.35 లక్షల కోట్లకు ఎగబాకాయని, ఎక్సైజ్ సుంకం పెంపుతో రికార్డు వసూళ్లు నమోదయ్యాయని లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా మహమ్మారి తాకిడితో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పడిపోవడంతో ఆదాయం పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని రూ 19.98 నుంచి రూ 32.9కి పెంచింది.
ఇక డీజిల్పై లీటర్కు రూ 15.83 నుంచి రూ 31.8కి ఎక్సైజ్ సుంకాన్ని పెంచామని పెట్రోలియం సహజవాయు సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. దీంతో 2020-21లో పెట్రోల్, డీజిల్పై పన్నను వసూళ్లు 88 శాతం పెరిగి రూ 1.78 లక్షల కోట్ల నుంచి రూ 3.35 లక్షల కోట్లకు ఎగిశాయని తెలిపారు.
కరోనా కట్టడికి లాక్డౌన్ విధించడం ఇతర నియంత్రణలు అమలవడంతో ఇంధన విక్రయాలు తగ్గడం ద్వారా పన్ను వసూళ్లు తగ్గాయని లేకుంటే పన్ను వసూళ్లు మరింత పెరిగేవని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ వరకు రూ.1.01 లక్షల కోట్ల ఎక్సయిజ్ వసూళ్లు జరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మరో ప్రశ్నకు సమాధానంగా లోక్సభలో తెలిపారు.
ఇందులో కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే లేదని, ఎటిఎఫ్(ఆల్కహాల్, టుబాకో, ఫైర్ ఆర్మ్), సహజ వాయువు, ముడి చమురు ద్వారా లభించే పన్నులు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎక్సయిజ్ ఆదాయం రూ.3.80 లక్షల కోట్లు ఉంది.
వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పెట్రోల్ ధరలను 39 సార్లు, డీజిల్ ధరలను 36 సార్లు పెంచినట్లు తేలి తెలిపారు. అయితే, పెట్రోల్ ధరలు ఒక్కసారి, డీజిల్ ధరలను రెండుసార్లు తగ్గించినట్లు ఆయన చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ ధరలు 76 సార్లు, డీజిల్ ధరలు 73 సార్లు పెరిగాయని మంత్రి తెలిపారు.
More Stories
హిమాచల్లో సుఖు సర్కారు కుప్పకూలిపోవచ్చు
ఇంగ్లాండ్ మ్యాచ్లో రికార్డులు సృష్టిస్తున్న జైస్వాల్
రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు