ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా, ప్రజలకు అండగా సుప్రీం కోర్ట్ 

ఏదైనా తప్పు జరుగుతుంటే, అటువంటి సమయంలో సుప్రీంకోర్టు ఒక ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా ప్రజలకు అండగా ఉంటుందన్న విషయం దేశ పౌరులందరికీ తెలుససని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి.రమణ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజలకున్న అపారమైన విశ్వాసంతో పాటు భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు మోటో ‘యథో ధర్మ స్తథో జయ (ధర్మం ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటుంది)’కు ప్రాణం పోసిందని తెలిపారు. 
 
సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ మీడియేషన్‌ సెంటర్‌ శనివారం నిర్వహించిన ఇండో-సింగపూర్‌ మీడియేషన్‌ సమ్మిట్‌-2021లో ఎన్‌వి.రమణ కీలక ప్రసంగం చేస్తూ  విభేదాలతో పాటు వాటిని పరిష్కరించే యంత్రాంగం కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం  స్పష్టం చేశారు. 
 
వ్యాజ్యాలకు మధ్యవర్తిత్వ పరిష్కారం అత్యుత్తమ మార్గమని, దీనితో సామాన్య జనులకు మేలు జరుగుతుంది. న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. న్యాయానికి సకాలంలో న్యాయం దక్కుతుందని తెలిపారు. మధ్యవర్తిత్వ పరిష్కారం తక్కువ ఖర్చుతో కూడుకున్నది, కాలాయాపన లేనిదని చెప్పారు.
ఈ ప్రక్రియతో తక్షణ న్యాయం అవసరం అయిన సామాన్యుడికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జటిల సమస్యల పరిష్కారానికి ప్రజలకు తక్షణ న్యాయానికి ప్రత్యామ్నాయ పరిష్కార వేదికలను ఏర్పాటు చేయడం చాలా మంచి ఆలోచన అని కొనియాడారు.
భారతీయ విలువలకు జీవ లక్షణం 
 

భారతీయ విలువల జీవలక్షణంగా ఉందని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి మహాభారతాన్ని ప్రస్తావించారు. పూర్వకాలంలోనే సంధి యత్నాలు, జగడాల నివారణ ప్రక్రియలు విరివిగా ఉండేవి. ఇందుకు మహాభారతం ఉదాహరణగా నిలుస్తుంది. 

శ్రీకృష్ణ భగవానుడు కౌరవ పాండవుల మధ్య ఘర్షణ నివారణకు సంధి మంత్రం ఆచరించారు. ఘోర వినాశనపు యుద్ధ నివారణకు సంధి ముఖ్యమని చెప్పారు. సంధి లేదా మధ్యవర్తిత్వాలు విఫలం అయితే ఏం జరుగుతుంది? ఎంతటి దారుణ పరిస్థితి ఏర్పడుతుందనే విషయం కూడా మనం గమనించవచ్చని తెలిపారు.

సమాజం అన్నాక సహజంగానే పలు కారణాలతో వివాదాలు, ఘర్షణలు ఉండనే ఉంటాయి. ఇవి అనివార్యం అవుతాయి. రాజకీయ, ఆర్థిక, సామాజిక, కట్టుబాట్ల, సాంస్కృతిక కారణాలతో వైరాలకు కయ్యాలకు కాలు దువ్వడాలు జరిగే సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయని తెలిపారు. వీటికి పరిష్కారం సాధ్యమైనంత త్వరగా, జటిలం కాకముందే కనుగొనాల్సి ఉంది. ఇందుకు ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను కనుగొనడం అత్యవసరం అని జస్టిస్ ఎన్‌వి రమణ తెలిపారు.

భారతీయ న్యాయవ్యవస్థ చతికల పడలేదు

కాగా, భారత న్యాయస్థానాలలో పెండింగ్ కేసుల సంఖ్య నాలుగున్నర కోట్లు దాటిందనే గణాంకాలు, సంబంధిత పరిస్థితితో కేసుల భారాన్ని తట్టుకోలేకుండా భారతీయ న్యాయవ్యవస్థ చతికిల పడిందనే వాదన  అధార్మిక విశ్లేషణ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

అయితే న్యాయవ్యవస్థలో తీర్పుల వెలువరింత లేదా కేసుల విచారణ క్రమంలో ఏళ్ల తరబడి జాప్యం నిజమే అని, దీనికి పలు కారణాలు ఉన్నాయని ప్రత్యేకించి ఉబుసుపోక, తప్పుడు దావాలతో, ఫిర్యాదీల అసమంజస ధోరణిలతో కూడా ఎక్కువగా కేసులు వాయిదా పడుతూ వస్తున్నాయిని చెప్పారు. 

ఇటువంటి పరిణామాలు తలెత్తకుండా వ్యాజ్యాలు కడుదూరం సాగకుండా ఉండేందుకు మధ్యవర్తిత్వ మార్గం అత్యుత్తమని జస్టిస్ తెలిపారు. మనకు అప్పట్లో మహాభారతం నుంచి మధ్యవర్తిత్వం లేదా సంధి ప్రక్రియలతో రాజీ మార్గం గురించి విని ఉన్నామని , దీనిని మనం ఇప్పుడు ఆచరణీయం చేసుకోవచ్చునని జస్టిస్ రమణ తెలిపారు.

న్యాయపరమైన కార్యక్రమం దేశంలో గొప్ప విజయం సాధించిందని చెబుతూ ఇది దేశంలో దాదాపు 70 శాతం మందికి ముఖ్యంగా పేదలు, మహిళలు, చిన్నారులు, మైనార్టీలు, వృద్ధులకు, వికలాంగులకు న్యాయం అందడంలో సాయం చేసిందని చెప్పారు. లోక్‌అదాలత్‌ వంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాల ప్రభావాన్ని ఈ సందర్భంగా సిజెఐ ప్రస్తావించారు.