రాయిటర్స్‌ ఇండియా చీఫ్‌ ఫొటోగ్రాఫర్ ఆఫ్ఘన్ లో హత్య

రాయిటర్స్‌ ఇండియా చీఫ్‌ ఫొటోగ్రాఫర్ ఆఫ్ఘన్ లో హత్య

రాయిటర్స్‌ ఇండియా చీఫ్‌ ఫొటోగ్రాఫర్‌, పులిట్జర్‌ గ్రహీత దానిష్‌ సిద్ధిఖీ ఆఫ్ఘనిస్తాన్‌ ఉగ్రవాద దాడిలో దారుణ హత్యకు గురయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌ కందహార్‌లోని స్పిన్‌ బోల్డాక్‌ జిల్లాలో జరుగుతున్న ఘర్షణలకు సంబంధించిన వార్తలను గత కొద్దిరోజులుగా సిద్ధిఖీ కవర్‌ చేస్తున్నారు. ఆ వార్తలను కవర్‌ చేస్తున్నట్లు స్థానిక ఆప్ఘన్‌ న్యూస్‌ చానెల్స్‌లో వార్తలొచ్చాయి. 

దానిష్‌ సిద్ధిఖీ మరణించినట్లు భారతదేశంలో ఆప్ఘనిస్తాన్‌ రాయబారి ఫరీద్‌ స్వయంగా ట్విటర్‌ ద్వారా తెలిపారు. ‘గత రాత్రి కందహార్‌లో భారత జర్నలిస్టు దానిష్‌ సిద్ధిఖీపై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు… ఆప్ఘన్‌ భద్రతా దళాలతో ఉన్నారు. ఉగ్రవాదుల దాడిలో ఆయన హత్యకు గురయ్యారని విని తానెంతో బాధపడుతున్నానని’ ఫరీద్‌ తన ట్వీట్‌లో వెల్లడించారు.

ఆఫ్ఘ‌న్ స్పెష‌ల్ ఫోర్సెస్ వెంట ఉంటూ అక్క‌డి ప‌రిస్థితిపై ఆయ‌న రిపోర్ట్ చేస్తున్నారు. స్పిన్ బోల్డ‌క్‌లోని ప్ర‌ధాన మార్కెట్ ప్రాంతాన్ని ఆఫ్ఘ‌న్ ప్ర‌త్యేక ద‌ళాలు త‌మ ఆధీనంలోకి తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలో తాలిబ‌న్లు ఫైరింగ్ జ‌రిపారు. ఇందులో సిద్దిఖీతోపాటు ఓ సీనియ‌ర్ ఆఫ్ఘ‌న్ ఆఫీస‌ర్ కూడా మృతి చెందారు.

పాకిస్తాన్‌తో కీలకమైన సరిహద్దును దాటడానికి ఆపరేషన్‌ ప్రారంభించిన తరువాత ఆప్ఘన్‌ దళాలు స్పిన్‌ బోల్డాస్క్‌లో తాలిబాన్‌ యోధులతో గొడవ పడ్డాయని అక్కడ మీడియా వర్గాలు తెలిపాయి. దానిష్‌ సిద్ధిఖీ, అతని సహోద్యోగి అద్నాన్‌ అబిడితో కలిసి 2018లో రోహింగ్యా శరణార్థుల సంక్షోభంపై డాక్యుమెంట్‌ చేసినందుకు వారి ఫీచర్‌ ఫొటోగ్రఫీకి పులిట్జర్‌ బహుమతిని అందుకున్నారు. 

ఈ బహుమతిని అందుకున్న మొదటి భారతీయులు వీరే కావడం గమనార్హం. అలాగే సిద్ధిఖీ 2020లో ఢిల్లీ అల్లర్లు, తాజాగా కోవిడ్‌ -19 మహమ్మారి, 2015లో నేపాల్‌ భూకంపం, 2016-17లో మోసుల్‌ యుద్ధం, హాంకాంగ్‌లో 2019-20 నిరసనలను కూడా ఆయన కవర్‌ చేశారు.