కేసుల సంఖ్య త‌గ్గుతున్న‌ద‌నే అల‌స‌త్వం ప‌నికిరాదు

కేసుల సంఖ్య త‌గ్గుతున్న‌ద‌నే అల‌స‌త్వం ప‌నికిరాద‌ని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. థ‌ర్డ్ వేవ్ ముంచుకొస్తుంద‌నే ఆందోళ‌నల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు క‌రోనా నిబంధ‌న‌ల‌ను విధిగా పాటించాల‌ని స్పష్టం చేశారు. 

 క‌రోనా కేసులు అధికంగా వెలుగుచూస్తున్న త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర‌, ఒడిషా, కేర‌ళ రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని మోదీ శుక్ర‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశ‌మ‌య్యారు. మొత్తం కేసుల్లో 80 శాతం ఈ రాష్ట్రాల నుంచే వెలుగుచూస్తుండ‌టంతో ఆయా రాష్ట్రాల్లో చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు.

మ‌నం థ‌ర్డ్ వేవ్ దేశాన్ని తాకుతుంద‌నే అంచ‌నాల న‌డుమ ఉన్నామ‌ని, 80 శాతం కేసులు ఈ రాష్ట్రాల్లోనే న‌మోద‌వుతున్న క్ర‌మంలో సెకండ్‌వేవ్ ఆరంభంలో ఉన్న ప‌రిస్థితి ప్ర‌స్తుతం నెల‌కొంద‌ని పేర్కొన్నారు. థ‌ర్డ్ వేవ్ ముంచెత్త‌నుంద‌నే అంచ‌నాల న‌డుమ కేసుల భారం అధికంగా ఉన్న రాష్ట్రాలు వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి క‌ఠిన చ‌ర్య‌లు చేపట్టాల‌ని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర ఆరోగ్య, రక్షణ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మాట్లాడుతూ  కోవిడ్‌ నివారణలో రాష్ట్రానికి అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తేలిపారు. రాష్ట్ర విభజన వల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొన్నామని, అత్యాధునిక వైద్య సదుపాయాలు రాష్ట్రంలో లేవని చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలు ఏపీలో లేవని గుర్తు చేశారు అయినా సరే కోవిడ్‌ను ఎదుర్కోవడంలో చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచామని  సంతృప్తి వ్యక్తం చేశారు.