వీఆర్‌వోలకు అధికారం అప్పగించే ఏపీ జిఓ సస్పెండ్

వీఆర్‌వోలకు అధికారం అప్పగించే ఏపీ జిఓ సస్పెండ్
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోమారు చుక్కెదురైంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 2ను ఏపీ హైకోర్టు సస్పెండ్‌ చేసింది. పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్‌వోలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసింది. 
 
దీనిని సవాల్‌ చేస్తూ గుంటూరు జిల్లా తోకలవారిపాలెం సర్పంచ్‌ కృష్ణమోహన్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషనర్‌ తరపున వాదనలు న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ వినిపించారు. పంచాయతీ సర్పంచ్‌ అధికారాలు వీఆర్‌వోలకు ఎలా ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. 
 
ఇప్పటివరకూ సర్పంచులు, కార్యదర్శుల ఆధ్వర్యంలో జరిగిన పాలనను వీఆర్‌వోలకు అప్పగించడమేంటని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేస్తు్న్నట్లు హైకోర్టు తెలిపింది.
 
మరోవంక, పాఠశాల విద్య, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పాఠశాల ఆవరణలో సచివాలయ నిర్మాణాలపై కోర్టు ధిక్కారం కింద కేసు నమోదు చేశారు. పంచాయతీరాజ్ కమిషనర్, కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీలకు  హైకోర్టు నోటీసులు జారీ చేసింది.