ఇకపై ఆధార్, పాన్‌కార్డులతోనే రైలు టికెట్ల బుకింగ్!

ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) వెబ్‌సైట్‌ ద్వారా ఇక ఎవరైనా రైల్వే టిక్కెట్లు బుక్ చేయాలి అనుకొంటే ఇకపై ఆధార్, పాన్ కార్డు, పాస్‌పోర్ట్ వంటి ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్‌లోకి లాగిన్ అవ్వాలంటే ఆధార్ కార్డు వివరాలనో, పాన్ కార్డు వివరాలోనో నమోదు చేయాల్సి ఉంటుంది.
తద్వారా ఆ కార్డుకు  లింక్ అయి ఉన్న ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాతే ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్‌లోకి లాగిన్ అయి టికెట్లను బుక్ చేసుకునే వీలు ఉంటుంది. ప్రస్తుతం ఈ తరహా విధానానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే పనిలో నిపుణులు ఉన్నారని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ వెల్లడించారు.
:రైలు టికెట్లు బుకింగ్ కోసం ఇదివరకు ప్రయాణికులు గంటల కొద్దీ కౌంటర్ల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉండేది. దీన్ని నివారించడానికి ఐఆర్‌సిటిసి ఉన్నచోటే స్మార్ట్‌ఫోన్ల ద్వారా రైల్వే టికెట్లను నిమిషాల్లో బుక్ చేసుకునే వెసలుబాటును ప్రయాణికులకు కల్పించింది. దేశంలో అత్యధిక మంది యూజర్లు వినియోగించే వెబ్‌సైట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.

దీన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు కొందరు. టికెట్లను బ్లాక్‌లో విక్రయించుకోవడానికి ఈ సౌకర్యాన్ని కూడా వదలట్లేదు.  కొందరు అక్రమార్కులు పెద్ద సంఖ్యలో టికెట్లను బుక్ చేసుకుని వాటిని రెట్టింపు ధరలకు ప్రయాణికులకు అమ్ముతున్నారు. తద్వారా మోసాలకు తెరతీస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలను మొదలు పెట్టింది.

‘భవిష్యత్తులో ఆధార్, పాన్, పాస్‌పోర్ట్ వంటి ధృవీకరణ పత్రాల వివరాలు ఇవ్వకుండా రైల్వే టికెట్లను కొనుగోలు చేయలేరు. ఏదో ఒక ప్రూఫ్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఆ తర్వాతే టికెట్లను బుక్ చేయగలరు. దీని వల్ల రైల్వే టికెట్ల బుకింగ్స్‌లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టొచ్చు. మా భవిష్యత్ ప్లాన్ ఇది. ఇది దాదాపుగా పూర్తయింది’ అని అరుణ్ కుమార్ తెలిపారు. 

ఆధార్ కార్డుతో లాగిన్ అయ్యేందుకు సంబంధించి పని పూర్తయింది. మిగిలిన కార్డులతో కూడా ప్రయాణికుడు వెబ్‌సైట్‌లో లాగిన్ అవగలిగేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. త్వరలోనే ఇది కూడా పూర్తవుతుందని అరుణ్ కుమార్ వివరించారు. 

2019వ సంవత్సరం నవంబర్ నెలలోనే దీనికి సంబంధించిన పనిని మొదలు పెట్టామని ఆయన వెల్లడించారు. 2021వ సంవత్సరం మే నెల వరకు టికెట్ల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్న 14,257 మందిని అరెస్ట్ చేశామని చెప్పుకొచ్చారు. రూ 28.34 కోట్ల రూపాయల విలువైన టికెట్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.