పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలపై అత్యాచారాలు పెరగడానికి కారణం వారు దుస్తులు ధరించే తీరేనని ఆయన చేసిన వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల యూజర్లతోపాటు అనేక మంది ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా ఆయనపై విరుచుకుపడ్డారు. తస్లీమా నస్రీన్ మంగళవారం ఇచ్చిన ట్వీట్లో, ‘‘ఓ మగాడు తక్కువ దుస్తులు ధరిస్తే, మహిళలు రోబోలు కాని పక్షంలో, ఆ మగాడు ధరించిన తక్కువ దుస్తుల ప్రభావం మహిళలపై ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
ఇమ్రాన్ ఖాన్ అర్ధ నగ్న ఫొటోను ఈ ట్వీట్తోపాటు తస్లీమా నస్రీన్ జత చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఓ వెబ్ న్యూస్ సర్వీస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఓ మహిళ చాలా తక్కువ దుస్తులు ధరిస్తే, పురుషులు రోబోలు కాని పక్షంలో, ఆ మహిళ ధరించిన తక్కువ దుస్తుల ప్రభావం పురుషులపై ఉంటుందని చెప్పారు.
ఇది సామాన్యంగా అర్థమయ్యే విషయమని తెలిపారు. ఇమ్రాన్ ఏప్రిల్లో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఓ ప్రశ్నకు సమాధానం చెప్తూ, తాను పరదా సంప్రదాయం గురించి మాట్లాడుతున్నానని పేర్కొన్నారు.
పాకిస్థాన్లో పూర్తిగా ప్రత్యేక తరహా సమాజం ఉందని చెప్పారు. వారి జీవన విధానం ప్రత్యేకమైనదని తెలిపారు. సమాజంలో ఓ స్థాయికి టెంప్టేషన్ను పెంచితే, ఈ చిన్న పిల్లలంతా వెళ్లడానికి దారి ఏదని ప్రశ్నించారు. దీని పర్యవసానం సమాజంలోనే ఉందని పేర్కొన్నారు. మనం నివసించే సమాజంపైనే ఇది చాలా వరకు ఆధారపడి ఉంటుందని తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ ముస్లిం లీగ్ అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబ్ కూడా ఘాటుగా స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ అసలు స్వరూపం బయటపడిందని ఎద్దేవా చేశారు. ప్రధాని మానసిక స్థితి అనారోగ్యంతో ఉన్నట్లు ప్రపంచం ఇప్పుడు గుర్తించిందని ధ్వజమెత్తారు.
మహిళలు ధరించే వస్త్ర ధారణ మగువులపై అత్యాచారాలకు దారితీయడం లేదని, మగవారి వికృత స్వరూపాలే కారణం అవుతున్నాయని ఆమె స్పష్టం చేశారు.
అధికారిక గణాంకాల ప్రకారం పాకిస్థాన్ లో ప్రతిరోజూ కనీసం 11 అత్యాచార సంఘటనలు నమోదు అవుతున్నాయి. గత ఆరేళ్లలో 22,000 సంఘటనలు నమోదయ్యాయి.
More Stories
సియాచిన్ గ్లేసియర్ వద్ద చైనా సరికొత్త రాదారి
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్
భారత్ తో వాణిజ్య సంబంధాలకై పాక్ ప్రధానిపై వత్తిడి