ఏపీలో నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

ఎపి గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్‌ అయిన నలుగురు వైసిపి అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్‌రాజు, రమేష్‌ యాదవ్‌లు సోమవారం ఉదయం అసెంబ్లీలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం చైర్మన్‌ బాలసుబ్రహ్మణ్యం నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. 
 
గవర్నర్‌ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మంత్రులు సుచరిత,  రంగనాథరాజు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, తానేటి వనిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

లేళ్ల అప్పిరెడ్డి : గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలేనికి చెందిన లేళ్ల అప్పిరెడ్డి సామాన్య రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. విద్యార్థి, యువజన, కార్మిక నేతగా పనిచేశారు. వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మోషేన్‌రాజు : పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేన్‌రాజు వైఎస్‌ జగన్‌ పార్టీని ప్రకటించిన మరుక్షణమే కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వైఎస్‌ జగన్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

తోట త్రిమూర్తులు : తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం సమీపంలోని వెంకటాయపాలెంకు చెందిన తోట త్రిమూర్తులు మండపేట అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. కాపులకు తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు.

రమేష్‌యాదవ్‌ : కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రాజగొల్ల రమేష్‌యాదవ్‌ ఉన్నత విద్యావంతుడు. విదేశీ విద్యా సంస్థలతో ఆయన మంచి సంబంధాలున్నాయి. ఆయన తండ్రి కూడా రాజకీయాల్లో కొనసాగారు.