వారణాసి, ముంబైలోనూ శ్రీవారి ఆలయాలు 

కశ్మీర్‌లో 18 నెలల్లో శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ  వారణాసి, ముంబైలోనూ శ్రీవారి ఆలయ నిర్మాణం చేపడతామని వెల్లడించారు. 

తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ మత్స్యకార కాలనీల్లో రాబోయే ఏడాది కాలంలో 500 ఆలయాలను నిర్మిస్తామని చెప్పారు. ధర్మప్రచారంలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. గుడికో గోమాత కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా 100 ఆలయాలకు గోవులను అందించామని చెప్పారు.

శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులను ఆలయాల నిర్మాణానికి వెచ్చిస్తామని సుబ్బారెడ్డి వెల్లడించారు.  గోవిందుడికి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతోనే నైవేధ్యం సమర్పిస్తున్నామని చెప్పారు. గత రెండేళ్లలో అనేక నిర్ణయాలు తీసుకున్నామని, సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఎల్1 దర్శనాలు రద్దు చేశామని వివరించారు.  

తిరుమలలో ప్లాస్టిక్ బ్యాన్ చేశామని, కరోనా సమయంలో ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. వరహస్వామి ఆలయానికి బంగారు తాపడం, వాకిలికి వెండి తాపడం పనులు చెస్తున్నామని తెలిపారు. స్వామివారికి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతో నైవేధ్యం సమర్పిస్తున్నామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

సెప్టెంబర్ నెలలోపు టీటీడీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడానికి కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. తిరుమలలోని అనధికారిక దుకాణాలను వారం రోజుల్లో తొలగిస్తామని స్పష్టం చేశారు. చిన్నపిల్లల ఆస్పత్రికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పారు. 

రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాల్లోటీటీడీ కల్యాణ మండపాలను నిర్మిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇక తిరుమలను గ్రీన్ జోన్‌గా ప్రకటిస్తున్నామని చెప్పిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించిందని, భవిష్యత్తులో తిరుమలకు కేవలం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడుపుతామని పేర్కొన్నారు. ఆకాశగంగ ప్రాంతాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మిస్తామని చెప్పారు.