బాలీవుడ్ సీనియర్ నటుడు, బెంగాల్ బీజేపీ నేత మిథున్ చక్రవర్తిని కోల్కతా పోలీసులు ప్రశ్నించారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిథున్ చేసిన ఓ ప్రసంగంపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి బుధవారం మిథున్ను 45 నిమిషాలపాటు పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఆయన పుట్టిన రోజునాడే ఆయనను పోలీసులు ప్రశ్నించడం గమనార్హం. 71 ఏళ్ల మిథున్ చక్రవర్తి.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పలు బహిరంగ సభల్లో, ర్యాలీల్లో ఆవేశపూరితంగా ప్రసంగించారు. కాగా, బెంగాల్ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసలో పలువురు బిజెపి కార్యకర్తలు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ హింసపై మిథున్ ప్రసంగాల ప్రభావం ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు. తాను నటించిన సినిమాల్లోని డయలాగ్లను మాత్రమే తాను తన ఎన్నికల ప్రసంగంలో చెప్పానని, వాటిని అక్షరాలనుబట్టి అర్థం చేసుకోకూడదని వాదించారు.
పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో, ‘‘నిన్ను ఇక్కడ తంతే, నీ శవం నేరుగా శ్మశానంలో పడుతుంది’’ అని మిథున్ చక్రవర్తి అన్నారని ఆరోపించారు. అయితే తాను ఆవేశంగా డైలాగులు చెప్పానే తప్ప.. ఉద్దేశపూర్వక ప్రసంగాలు చేయలేదని మిథున్ కోల్కతా కోర్టుకు విన్నపించాడు.
తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోర్టును కోరాడు కూడా. అయితే కోర్టు మాత్రం ఆయన్ని వర్చువల్గా ప్రశ్నించాలని పోలీసులను ఆదేశించింది. ఇక మరో బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘నేనేం ఉత్త పామును కాను. నల్లత్రాచుని. కాటేస్తే.. నీ ఫొటోకి దండ పడాల్సిందే’ అని అర్థం వచ్చేలా కామెంట్లు చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
More Stories
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్
20 రోజులు కూడా సమావేశం కాని తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలు
దేవెగౌడ కొడుకు, మనవడులపై అశ్లీల వీడియో కేసు