కాంగ్రెస్ రాష్ట్రాల్లో పెట్రోలుపై సేల్స్ ట్యాక్స్ ఎత్తేయండి

కాంగ్రెస్ రాష్ట్రాల్లో పెట్రోలుపై సేల్స్ ట్యాక్స్ ఎత్తేయండి
పెరుగుతున్న పెట్రోలు ధరలు పేదలకు భారంగా మారుతున్నాయన్న ఆందోళన ఉంటే పెట్రో ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు సేల్స్ ట్యాక్స్ (అమ్మకం పన్ను) ఎత్తివేయాలని పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సూచించారు.

మహారాజా అగ్రసేన్ ఆసుపత్రిలో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన ధర్మేంద్ర ప్రధాన్ అనంతరం మాట్లాడుతూ కరోనాతో పోరాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఖర్చులు, అభివృద్ధి పనులకు అదనపు సొమ్ములు అవసరమని గుర్తు చేశారు.  వీటిని పెట్రోలు, డీజిల్ నుంచి రాబట్టుకోవాలని చూస్తున్నట్టు చెప్పారు.

పెరుగుతున్న పెట్రో ధరలు వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తాయన్న విషయం తనకు తెలుసనిపేర్కొన్నారు. అయితే, ఆహార ధాన్యాలను ఉచితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదే ఏకంగా లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇది కాక, టీకాలు, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయల కోసం మరికొంత ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు.

ఆకాశాన్ని అంటుతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలపై మంత్రి స్పందిస్తూ.. ‘‘మరి వారే (కాంగ్రెస్) పాలిస్తున్న మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్‌లలో ధరలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి?” అని ప్రశ్నించారు. పేదలపై రాహుల్‌కు అంత ప్రేమే కనుక ఉంటే పన్నులను రద్దు చేయాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరాలని ధర్మేంద్ర ప్రధాన్ హితవు చెప్పారు.