కర్నూలులో హైకోర్టుకు రీ నోటిఫికేషన్‌ ఇవ్వండి

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు రీనోటిఫికేషన్‌ జారీ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరారు. 2019 ఎన్నికల సందర్భంగా బీజేపీ కూడా తన మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. గురువారం రాత్రి అమిత్‌షాతో ఆయన నివాసంలో గంటకు పైగా  సీఎం సమావేశమయ్యారని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ భేటీలో రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణ కోసం ప్రణాళిక రూపొందించుకున్నట్లు సీఎం తెలిపారు. ‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య అభివృద్ధిలో సమతుల్యత  సాధించడం కోసమే మూడు రాజధానుల విధానం అమలు చేయబోతున్నాం. వికేంద్రీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

అందులో భాగంగానే విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా చేస్తున్నామని, శాసన రాజధానిగా అమరావతిని, న్యాయ రాజధానిగా కర్నూలు చేయబోతున్నామని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని తెలిపారు. 

ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా కేంద్ర గ్రాంట్లు అధికంగా రాష్ట్రానికి వస్తాయని, ఆర్థిక భారం తగ్గుతుందని చెప్పారు. భారీ పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాల కల్పన జరగాలన్నా ప్రత్యేక హోదా చాలా అవసరమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రజలందరికీ అందుబాటులో మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని, అందుకై కొత్తగా 13 వైద్య కళాశాలల నిర్మాణాన్ని మొదలు పెడుతున్నాం మని తెలిపారు. కేంద్రప్రభుత్వం ఇప్పటికే 3 కాలేజీలను మంజూరు చేసిందని, మిగిలిన కాలేజీలకూ అనుమతివ్వాలని ముఖ్యమంత్రి కోరారు. అలాగే నర్సింగ్‌ కాలేజీలకూ అనుమతి ఇవ్వాలని, ఇందుకు అవసరమైన ఆర్థిక సాయం కూడా అందించాలని కోరారు. 

ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎ్‌స)లో భాగంగా బియ్యం సబ్సిడీ కింద రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌కు కేంద్రం నుంచి రావలసిన రూ.3,229 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని అమిత్‌ షాను సీఎం అభ్యర్థించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం చెల్లించాల్సిన రూ.4,652.70 కోట్లను తక్షణమే విడుదల చేయించాలని, సంవత్సరంలో ప్రస్తుతం ఉండే  పనిదినాలను 100 నుంచి 150కి పెంచాలని కోరారు. 

స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రావలసిన బకాయిలు రూ.529.95 కోట్లు ఉన్నాయని, 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి మరో రూ.497 కోట్ల బకాయిలు ఉన్నాయని, వెంటనే ఈ నిధులు విడుదల చేయాలని వివరించారు.  విద్యుత్‌ సంస్కరణల్లో రాష్ట్రం ముందంజలో ఉంది. అలాగే సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో కూడా మెరుగైన స్థితిలో ఉంది. అయితే రాష్ట్ర విద్యుత్‌ రంగ ఆర్థిక పరిస్థితి బాగోలేనందున ఏపీకి తగిన సహాయం చేస్తానని కేంద్ర విద్యుత్‌ శాఖ చెప్పిందని జగన్ పేర్కొన్నారు. 

కుడిగి, వల్లూరు థర్మల్‌ ప్లాంట్ల నుంచి అధిక ధరకు కొనుగోలు చేస్తున్న విద్యుత్‌ను సరెండర్‌ చేసే విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విద్యుత్‌ ప్లాంట్ల నుంచి కరెంటు కొనుగోలు ధర చాలా అధికంగా ఉంది. 300 మెగావాట్ల కరెంటు కొనుగోలుపై ఏటా రూ.325 కోట్ల ఫిక్స్‌డ్‌ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోందని చెప్పారు.