కరీంనగర్ లో నారద జయంతి వేడుకలు

విలువలు కలిగిన జర్నలిజం తోనే సమాజం మనుగడ సాధిస్తుందని, మెరుగైన సమాజం కోసం పాత్రికేయులు నిరంతరం కృషి చేయాలని సీనియర్ జర్నలిస్టు వల్లిశ్వర్ గారు అన్నారు. మే 29 నాడు, సమాచార భారతి ఆధ్వర్యంలో కరీంనగర్ లో నిర్వహించబడిన నారద మహర్షి జయంతి వేడుకల్లో భాగంగా జిల్లా పాత్రికేయులతో నిర్వహించిన ఆన్ లైన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నారద మహర్షి జయంతి వేడుకల్లో భాగంగా సమాచార భారతి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.

పత్రికా విధానాలకు, ఆవశ్యకతకు నారద మహర్షి ఆలోచనా విధానాలు బీజం వేశాయని, ప్రపంచంలోనే మొట్టమొదటి పాత్రికేయుడు నారద మహర్షి అనడంలో అతిశయోక్తి లేదన్నారు. త్రిలోక సంచారి అయినా నారదమహర్షి జ్ఞాన సంపన్నుడని, ఆయన ఆలోచనా విధానాలు , ఆచరించిన పద్ధతులు పత్రిక రంగ రూపకల్పనకు నాంది పలికాయన్నారు.

దేవ మహర్షి అయిన నారద ముని నిరంతరం త్రిలోక సంచారం చేస్తూఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించే విషయంలో, విషయాలను తెలియపరచడం లో ప్రథమంగా ఉండేవారని, అందుకే నారద మహర్షి ప్రధమ పాత్రికేయుడు అని ఆయన కొనియాడారు. అపార జ్ఞానసముపార్జన కలిగిననారద మహర్షి తన జ్ఞానాన్ని ,ఆలోచన విధానాలను అనుసరించి కేవలం ఒక్కరే ఆనాడు త్రి లోకాలకు సమాచారాన్నిఅందించేవారని తెలిపారు.

సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేయడంలో పత్రికా రంగం ప్రముఖ పాత్ర వహిస్తోంద‌ని, సమాజ మనుగడకు మీడియా రంగం కీలకంగా మారిందన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితులకు అ‌నుగుణంగా నాణ్య‌మైన‌, విశ్వ‌స‌నీయ సమాచారాన్ని అందించ‌డంలో ప్ర‌తి ఒక్క జ‌ర్న‌లిస్టు కృషి చేయాల‌ని ఆయ‌న సూచించారు.

వీటన్నిటికీ ఆద్యుడైన నారద మహర్షి జయంతి సందర్భంగా పత్రిక రంగం లోని ప్రతి ఒక్క పాత్రికేయుడు నారద మహర్షి నీ గుర్తు చేసుకొని, ఆయన ఆలోచనా విధానాలను, అందించిన సమాచార విజ్ఞానాన్ని తెలుసుకొని పాత్రికేయులు మరింత ముందుకు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్ఎ.స్ జిల్లా సంఘచాలక్ శ్రీ డా. ర‌మణాచారి గారు, విభాగ్ ప్రచారక్ చమర్తి దేవేంద్ర గారు, ప్రజ్ఞ భారతి జిల్లా అధ్యక్షులు శ్రీ నిరంజన్ చారి గారు, జిల్లా ప్రచార ప్రముఖ్ తడిగొప్పుల శంకరయ్య గారు, ఇత‌ర పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.