ఆక్సిజన్ కొరత లేకుండా కేంద్రం శాశ్వత చర్యలు 

దేశ వ్యాప్తంగా కోవిడ్ బాధితుల కోసం లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. దీనిలో భాగంగా రోజువారి ఆక్సిజన్ ఉత్పత్తిని 5,700 మెట్రిక్ టన్నుల నుండి 10,000 మెట్రిక్ టన్నులకు పెంచిన్నట్లు తెలిపారు.

దేశంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో లక్ష ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లను పీఎం కెర్స్ నిధుల ద్వారా ఏర్పాటు చేస్తున్నామని, ఆక్సిజన్ రవాణాకు ఉపయోగించే ట్యాంకర్స్  కొరత నివారణకు, వాటిని విదేశాల నుండి పెద్ద ఎత్తున దుగుమతి చేసుకున్నామని చెప్పారు. ప్రస్తుతానికి 1681 ఆక్సిజన్ ట్యాంకర్స్ అందుబాటులో ఉండగా, వాటి రవాణా సామర్థ్యం మొత్తం 23,056 మెట్రిక్ టన్నులు. అలాగే మెడికల్ ఆక్సిజన్ సిలిండర్స్  (11 లక్షల 19 వేలు) అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి తెలిపారు.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి గత 8 నెలల క్రితం వరకు కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో గత 74 సంవత్సరాలలో ఏర్పాటు చేసుకున్న వెంటిలేటర్లు 20 వేలలోపే ఉండగా, కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్తగా 51 వేల వెంటిలెటర్స్ ను పీఎం కెర్స్ నిధుల ద్వారా సమకూర్చమని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో  శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్ కొరత నివారణకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ సహకారంతో దేశవ్యాప్తంగా 490 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు పీఎం కెర్స్ నిధులతో కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ఆయన తెలిపారు.

తేలికపాటి యుద్ధ విమానం “తేజస్”లో అక్కడికక్కడే ఆక్సిజన్ తయారుచేసేందుకు  రూపకల్పన చేసిన అధునాతన  టెక్నాలజీని  కూడా ఉపయోగించుకుని దేశంలో  ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు ఆక్సిజన్ అందించడానికి  శాశ్వత  ప్రాతిపాదికన డి ఆర్ డి ఓ టెక్నాలజీతో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని  కిషన్ రెడ్డి తెలిపారు.  

ఈ టెక్నాలజీ  సాయంతో  ఏర్పాటయ్యే పీఎస్ఎ ప్లాంటు  ఒక్కొక్కటి నిమిషానికి  1000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉందని, ఒక్కొక్క ప్లాంటు  ద్వారా 150 నుండి 190 మంది వ్యాధిగ్రస్తులకు ఆక్సిజన్ అందించవచ్చని కిషన్ రెడ్డి వివరించారు. ఇంకా అదనంగా 195 సిలిండర్ లలో వీటి ద్వారా ఆక్సిజన్ నింపవచ్చని తెలిపారు.

పీఎం కెర్స్  నిధుల ద్వారా ఇటువంటి ప్లాంట్స్  తెలంగాణా రాష్ట్రంలోని 19 ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులలో ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి  నరేంద్ర మోది ఆదేశాలు ఇచ్చారని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 23 ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ ప్లాంట్స్ ఏర్పాటు జరుగుతున్నదని తెలిపారు.

మొదటి దశలో తెలంగాణాకు 19 ఆక్సిజన్ ప్లాంట్లు, ఆంధ్ర రాష్ట్రానికి 23 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రధానమంత్రి పీఎం కెర్స్ ద్వారా మంజూరు చేశారని, దశల వారిగా  అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో, ముఖ్యంగా అన్ని జిల్లా కేంద్రాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో పీఎస్ఎ ఆక్సిజన్  ప్లాంట్లు  ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని హామీ ఇచ్చారు. 

అదే విధంగా పీఎం కెర్స్ నిధులతో తెలంగాణా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు 1,400 వెంటి లెటర్స్ ను సమాకూర్చామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.