హిందుత్వ జాతీయవాద ప్రతీక సావర్కార్ 

రాంపల్లి మల్లిఖార్జునరావు, 

సామజిక, రాజకీయ విశ్లేషకులు

* జన్మ జయంతి సంస్మరణ 

1857 స్వాతంత్య్ర సంగ్రామంలో అపజయం పాలైన హిందూ సమాజం ఒకరకంగా అంతర్ముఖం అయింది. ఈ సమయంలో  స్వాతంత్రం కోసం సుదీర్ఘ సమరానికి సమాజాన్ని సిద్ధం చేయడానికి అనేకమంది అనేక రకాల ప్రయత్నాలు చేశారు.   

ఆ ప్రయత్నాలలో కీలకమైన కొన్ని కీలక ఘట్టాలు:  1) దయానంద సరస్వతి 1875 లో ఆర్యసమాజ్  స్థాపించడం 2) వాసుదేవ బలవంతఫడ్కే  వ్యక్తిగత స్థాయిలో బ్రిటిష్ వారిపై సమరం సాగించడం 3 )1885లో కాంగ్రెస్ సంస్థ ఏర్పాటు 4) తిలక్ నాయకత్వంలో రాజకీయ ఉద్యమాలు   5) కాంగ్రెస్ లో  అతివాదులు, మితవాదులు గా చీలిక  6) హిందూ మహాసభ ప్రారంభం. 

ఇక్కడే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి,  1857 స్వతంత్ర పోరాటం తర్వాత బ్రిటిష్ పార్లమెంటు నేరుగా  భారత దేశాన్ని పరిపాలించటం ప్రారంభమైనది.  దానితో భారతదేశం ప్రజాస్వామ్యం దేశంగా అవతరణ కు  సన్నాహాలు ప్రారంభమయ్యాయి.  దానితో ఈ దేశం జాతీయతను పునర్  నిర్వచించుకోవల్సిన    అవసరం ఏర్పడింది.

ఈ దేశంలో వేల సంవత్సరాల నుండి సామాజికంగా,  సాంస్కృతికంగా,  ఆధ్యాత్మికంగా,  ఆర్థికంగా ఒకే దేశంగా ఉండేది,  పాలనాపరంగా అప్పుడప్పుడు శక్తివంతమైన సామ్రాజ్యాలు ఉన్నప్పటికీ,  దేశంలో అనేక రాజ్యాలు ఉండేవి,  ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పరంగా ఒకే పాలన క్రింద ఉన్నప్పడు  జాతీయవాదాన్ని నిర్వహించు కోవలసిన అవసరం ఏర్పడింది. 

ఈ దేశం లో  సాంస్కృతిక జాతీయ వాదానికి  బంకించంద్ర,  వివేకానంద,  అరవింద  పునాదులువేశారు,   ఆ తర్వాతి కాలంలో స్వాతంత్ర  వీరసావర్కర్, డాక్టర్ కేశవరావు బలీరాం హెడ్గేవార్,  గురూజీ మొదలైన వాళ్ళు ఆ భావాలను పటిష్టం చేసి దేశ వ్యాప్తం చేసేందుకు పని చేశారు. 

మనదేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్న  కాలంలోనే రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగితే,  1939 సెప్టెంబర్ 1 నుండి రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనది .  రెండవ ప్రపంచ యుద్ధానికి కంటే ముందే స్వతంత్ర వీరసావర్కర్ సమర శంఖం పూరించారు.  1906 నుండి 66 వరకు అవిశ్రాంత పోరాటం చేశారు. 

ఈ దేశంలో ఒక సైద్ధాంతిక కర్తగా , విప్లవాల నాయకుడిగా,  రాజకీయాల్లో అటు బ్రిటిష్ వాళ్లకు ,ఇటు కాంగ్రెస్ వాళ్లకు  ఒక విస్మరించని నాయకుడిగా  గుర్తింపబడి, తనదైన శైలిలో లో పని చేసిన ఆయన జీవితం లోని కొన్ని ప్రముఖ సందర్భాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆనాటి దేశ పరిస్థితులు,  స్వాతంత్ర పోరాటం తీరు తెన్నులు  మనకు సులభంగా అర్థం అవుతాయి. 

1883లో వాసుదేవ బలవంత ఫడ్కే, ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి ఇరువురు మరణించారు .  ఆ ఇరువురి పనులను కొనసాగించటానికి అన్నట్లు 1883 మే 28వ తేదీన వినాయక్ దామోదర్ సావర్కర్ నాసిక్ సమీపంలో భగూర్  గ్రామంలో జన్మించారు.  

విద్యార్థి గానే విప్లవ భావాలు 

ఉన్నత పాఠశాల విద్యార్థిగానే వీరగాథలను,  కావ్యాలను,  రచించడం ప్రారంభించారు.  అవి అనేక పత్రికలలో ప్రచురించబడుతూవుండేవి.  1900లో  మిత్ర మేళ పేరున విప్లవకారుల బృందం ఏర్పాటు చేశాడు.  అభినవ భారత్ పేరుతో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సంస్థను  1904లో ప్రారంభించారు.  1906 లో న్యాయవాద విద్య కోసం లండన్ చేరి  అక్కడ శ్యామ్ జీ,  కృష్ణ వర్మ స్థాపించిన ఇండియన్ హౌస్ లో నివాసం ఉన్నారు.   అక్కడి నుండే మనదేశంలో  విప్లవ కార్యకలాపాలకు పునాదులు వేశారు.  1906లో లండన్ లో సావర్కర్ కు  మొట్టమొదటిసారి గాంధీజీ తో పరిచయం జరిగింది.

 1909 మార్చి మొదటి వారంలో రష్యా అధినేత లెనిన్ ను సావర్కర్  కలిశారు,  భారత స్వతంత్ర పోరాటంలో విప్లవ కార్యకలాపాలు గురించి చర్చించారు.  అట్లా నాలుగు సార్లు ఇరువురు కలవడం జరిగింది.  విప్లవకారులు  భగవద్గీతగా భావించే   ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం గ్రంధాన్నిసావర్కర్  బ్రిటిష్ మ్యూజియంలో చాలా రోజులు అధ్యయనం చేసి, వాస్తవ చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చారు. 

దానిని  ముద్రణ కాకముందే బ్రిటిష్ ప్రభుత్వం  నిషేధించిది. , దానితో  ఆ పుస్తకాన్ని 1909లో హాలెండ్ లో  ముద్రించారు. అట్లా  లండన్ నుండి విప్లవ సాహిత్యం,  ఆయుధాలు మహారాష్ట్రకు చేరుతుండెడివి. మహారాష్ట్రలో బాంబులు,  పిస్తోలు మ్రోతలతో బ్రిటిష్ ప్రభుత్వము అప్రమత్తమైంది. 

ఈ సందర్భంలో వీర సావర్కర్ అన్నగారైన గణేష్ సావర్కర్ ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత దేశంలోని క్రూరుడైన   ఆంగ్లేయ అధికారి కర్జన్ వాయిల్ ను  1909 జూలై 1న  తేదీనలండన్ లో మదన్ లాల్ దింగ్రా చంపేసి అక్కడే నిలబడ్డాడు.  దానితో  పట్టుపడిన దింగ్రాను విచారణ చేసి   1909 ఆగస్టు 17న ఉరి శిక్ష విధించారు. 

 ఆ సమయంలో లో నెహ్రూ లండన్ లో ఉన్నప్పటికీ ఆ ఉరి శిక్ష  గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  1910లో మార్చి 13న ప్యారిస్ నుంచి లండన్  రైల్ లో దిగిన సావర్కర్ ను ప్లాటుఫారం మీదే   బ్రిటిష్ వాళ్ళు నిర్బంధించారు.  కర్జన్ వాయిల్  హత్యకు కుట్రదారుడుగా  గాసావర్కర్ ను  విచారించేందుకు భారతదేశం తీసు కు వస్తున్న సమయంలో 1910 జూలై 10న  తప్పించుకొని  సముద్రంలో దూకి  ఈదుతూ ఫ్రెంచ్ గడ్డమీద చేరాడు.

అక్కడ ముందు యోజన ప్రకారం సురక్షిత ప్రాంతానికి తీసుకు వెళ్ళవలసినవారు సమయానికిరాని కారణాన బ్రిటిషు పోలీసులకు  తిరిగి పట్టుబడి భారత్ కు తీసుకోని వచ్చారు. న్యాయ విచారణ   1910 అక్టోబర్ 23న పూర్తి చేసి సావర్కర్  కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.  అదే సమయంలో నాసిక్  కలెక్టర్ జాన్సన్ హత్యకు గురయ్యారు. 

దాని వెనుక కూడా సావర్కర్ కుట్రనే ఉన్నాదని విచారణ చేసి  1911 జనవరి 30న మరో యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. దానితో రెండు యావజ్జివ కారాగార శిక్షలు విధించి,  సావర్కర్ ను అండమాన్  నికోబార్ దీవుల లోని జైలు కు తరలించారు. 

కఠిన కారాగార శిక్ష అనుభవిస్తూనే అనేక కవితలు రచించాడు.   వ్రాయటానికి పెన్ను పేపరు లేని కారణంగా జైలు గోడల పైన 15 వేల పంక్తులు  రాశారు.  అక్కడే హిందువు అంటే ఎవరు అనే నిర్వచనం ఒక శ్లోకం లో వివరించాడు. 

ఆ  సింధు  సింధు పర్యన్త    యస్య భారత భూమికా

పితృభూ:పుణ్యభూ శ్చవ  సవై హిందు రితి స్మృతః 

 అంటే సింధువు  నుండి  సింధువు  వరకు వ్యాపించి ఉన్న ఈ దేశాన్ని పుణ్యభూమిగా ,పితృ భూమిగా   ఎవరు భావిస్తూ ఉంటారో వారే  హిందువులు.

కౌన్సిల్ ఆఫ్ స్టేట్  బ్రిటిష్ ప్రభుత్వంపై సావర్కార్ విడుదలకు 1921 మార్చి లో ఒక   తీర్మానం చేసింది.  ఆ   ఒత్తిడి కారణంగా 1921లో సావర్కర్ ను  అండమాన్ జైలు  నుండి అలీపూర్ జైలుకు, కొంతకాలం తరువాత రత్నగిరి జైలుకు తరలించారు.1922లో రత్నగిరి  జైల్లో   ఉన్నప్పుడు” హిందుత్వ” అనే పుస్తకం రాసి పేరు లేకుండా నాగపూర్ లోని  వి.  వి కేల్కర్   గారికి పంపించారు,  వారు దానిని ముద్రించారు. 

తుదకు 1926 జనవరి 6న సంవత్సరాల పాటు ఏ రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్న రాదు అనే  షరతులతో,  పరిమిత స్వేచ్ఛతో విడుదల చేశారు. 1924లో రత్నగిరి లో అంబేద్కర్ సావర్కర్ ను కలిశారు.  అదే    సంవత్సరం ఆర్ఎస్ఎస్ నిర్మాత డాక్టర్ హెడ్గేవార్ కూడా సావర్కర్ ను కలిశారు.  1937 మే 10న సావర్కర్ పై  అన్ని ఆంక్షలు  తొలగించారు. 

సావర్కర్ అక్కడి నుండి తన నివాసాన్ని ముంబై కి మార్చుకున్నారు, అప్పటినుండి హిందుత్వ భావ చైతన్యానికి తెరలేపారు.  దానికి  హిందూ మహాసభ ను తన రాజకీయ వేదికగా మలుచుకున్నారు.  అట్లాగే స్వాభిమాన హిందూ సమాజం పరాక్రమ చరిత్రే వారు రచించిన ” చరిత్రలో ఆరు స్వర్ణపుటాలు” అనే పుస్తకం.    

మాట దాటవేసిన గాంధీజీ

సావర్కారుకు  1906లో లండన్ లో మొదటిసారిగా గాంధీజీ తో పరిచయమైంది.  1909లో యూకే లో జరిగిన విజయదశమి ఉత్సవం లో  గాంధీజీ సావర్కర్  ఒకే వేదిక మీద ఉన్నారు.  గాంధీజీ రాముని త్యాగమూర్తి అని ప్రస్తుతిస్తే , సావర్కర్  దుష్టశక్తులను సంహరించిన దుర్గామాతను వర్ణించారు. 1927 మార్చి 1న రత్నగిరిలో సావర్కార్ ను  గాంధీజీ కలుసుకున్నారు.

దానితో సావర్కర్  ” అంటరానితనం, శుద్ధి  కార్యక్రమాల గురించి మీ అభిప్రాయాలు చెప్పండి అని’ ‘గాంధీజీని అడిగారు.  దానికి గాంధీజీ ‘నాకు ఇప్పుడు  ఎక్కువసమయం లేదు.   నీవు  రత్నగిరి లోనే ఉంటావు గదా . నేను వీలు చూసుకుని రెండు మూడు రోజులు నీతో పాటు ఉండేట్లు వస్తాను.    అప్పుడు అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం” అని చెప్పి దాటవేశారు.

1933 ఫిబ్రవరి 25న గాంధీజీ సావర్కార్ కు  వ్రాసిన ఉత్తరంలో సామాజిక సమస్యల పరిష్కారానికి సావర్కార్ కృషిని ప్రశంసించారు.  గాంధీజీ తన ఆత్మ కథలో  వాల్యూమ్ 38- 138 వ పేజీలో రాజకీయ ఖైదీల గురించి నేను మాట్లాడను.  అయినా సావర్కర్ భాయి జైలు నుండి  విడుదలకు నా ప్రయత్నం నేను చేశాను అని  వ్రాసుకున్నారు.

1120లో భారత్ పై గజినీ దాడి తర్వాత ఈ దేశానికి అంతగా నష్టం జరిగిన సంవత్సరం 1930  అని సావర్కర్ వర్ణించారు ఎందుకంటే ఆ సంవత్సరమే గాంధీజీ ఒక ప్రక్క సహాయ నిరాకరణ ఉద్యమం,  మరోపక్క ఆత్మహత్య సదృశమైన  ఖిలాఫత్ ఉద్యమంకు పిలుపిచ్చారు. కాంగ్రెస్ నిర్వహించిన  క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ప్లిట్  ఇండియా ఉద్యమంగా సావర్కర్  అభివర్ణించారు.  ఈ ఉద్యమం దేశ సమైక్యతకు నిలిచే పక్షంలో హిందూ మహాసభ కూడా మద్దతు ఇస్తుందని  ప్రకటించారు.

స్వతంత్ర భారత్ లో కూడా అవమానాలే 

గాంధీజీ హత్య సందర్భంలో సావర్కర్ ను అదుపులోకి తీసుకొన్నారు.  గాంధీజీ హత్య కేసు ఢిల్లీలోని ఎర్రకోటలో విచారణ జరిగింది.  ఆ విచారణలో సావర్కర్ నిర్దోషిగా కోర్టు తీర్పు చెప్పింది.  తీర్పు వచ్చిన వెంటనే ఎర్ర కోట నుండి బయటకు వెళ్లరాదని సావర్కర్ పై కోర్ట్  ఆంక్షలు పెట్టింది.  మరికొద్ది గంటల్లోనే  సావర్కర్ మూడు నెలలపాటు ఢిల్లీలో అడుగు అడుగుపెట్టరాదని  ఉత్తర్వులు జారీ చేసింది. 

దానితో సావర్కర్ ను ఢిల్లీ పోలీసులు ప్రత్యేక రైలులో 1949 ఫిబ్రవరి 12న రహస్యంగా ముంబయిలోవదిలిపెట్టరు. 1950 ఏప్రిల్ 4న నెహ్రూ లియాకత్ అలీఖాన్  ల మధ్య జరిగిన ఒప్పందంపై ఇరువురు  సంతకాలు చేశారు. ఆ ఒప్పందం పాకిస్తాన్ ముస్లింలకు అనుకూలంగా, హిందూ శరణార్ధులకు అవమానకరంగా  ఉంది.  దానికి నిరసనగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ కేంద్ర మంత్రి మండలి  పదవికి కి రాజీనామా చేశారు. 

ఆ సందర్భంగా నిరసన తెలియ చేసిన  హిందూ మహాసభ నాయకులను  కూడా అప్పటి ప్రభుత్వం నిర్బంధించింది.  సావర్కార్ గూడా నిర్బంధించారు. సావర్కార్ విడుదలకు వారి కొడుకు   హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు.  అప్పుడు హైకోర్ట్ సావర్కర్ ను ఒక సంవత్సరం పాటు రాజకీయ కార్యకలాపాలు పాల్గొనరాదని షరతుతో జూలై 13 న విడుదల చేసింది. 

హైకోర్టు విధించిన షరతు  కారణంగా సావర్కర్ హిందూ మహాసభకు  రాజీనామా చేశారు.  ఆ సమయంలో 1950 ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర ఉత్సవాలలోసావర్కర్ జాతీయ జెండా ఎగురవేయవచ్చు కానీ  ఎటువంటి ఉపన్యాసం ఇవ్వకూడదని షరతు విధించారు. 

 1915 మార్చ్ 9న అండమాన్ నుండి సావర్కర్  వ్రాసిన లేఖలు హిందువులు ఆధునిక యుద్ధ పరిజ్ఞానం లో  సైనిక శిక్షణ పొంది సైనిక జాతిగా రూపొందాలని   దానికి అడ్డు వచ్చే శాస్త్రాలు,  శాస్త్రార్ధాలను   ప్రక్కకు నెట్టి చేయాలని పిలుపు నిచ్చారు . 1937 డిసెంబరులో  నాగపూర్ లో మాట్లాడుతూ పాకిస్తాన్ ఏర్పడే ప్రమాదంగురించి  హెచ్చరించారు. 

1939 అక్టోబర్ 27న ఆర్యసమాజ్ కార్యకర్త మాణిక్యరావును ముస్లింలు హత్య చేసారు.  దానికి నిరసనగా సావర్కర్  పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ధర్నా  నిర్వహించారు,  గాంధీజీ ఆర్య సమాజ్ వాళ్ళపై వత్తిడి  తీసుకొచ్చి ఆ  ఉద్యమాన్ని ఆపాలని ప్రయత్నించినా అది ఆగలేదు.  ఆ సమయంలో  15 వేల మంది హిందువులు జైలు పాలయ్యారు.  18 మంది మరణించారు.  దానితో నిజాం దిగివచ్చి హిందువులకు కూడా పౌర హక్కులు కల్పించారు. 

సుభాష్, శ్యామప్రసాద్ ముఖర్జీల సమావేశం 

సుభాష్ చంద్రబోస్ 1941 జనవరిలో దేశం వదిలివెళ్లేందుకు  కొన్ని నెలలు ముందుగా  వీర సావర్కర్ ను కలుసుకుని రెండవ ప్రపంచ యుద్ధం, అంతర్జాతీయ పరిణామాలు,  భారతదేశ స్వతంత్ర పోరాటం ఉదృతం చేయటానికి దేశం బయట విప్లవం నిర్మాణం చేయాలని అంశాలను  చర్చించారు.

 ఏ బ్రిటిష్ ప్రభుత్వం కారణంగా  సావర్కారు  29 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించారో ఆ  బ్రిటిష్ ప్రభుత్వం వైస్రాయ్  లార్డ్ లిన్ లిల్గో   1939 సెప్టెంబర్ 1 సావర్కర్ తో రెండవ ప్రపంచ యుద్ధం పరిణామాలపై చర్చించారు. ఆ సమయంలో   సావర్కర్  దేశ సరిహద్దుల  రాష్ట్రాలలోసిఖ్ , గుర్ఖా ల  సైన్యాన్ని ఉంచాలని సూచించారు. తూర్పు నుండే భారతదేశంపై దండయాత్ర   జరగవచ్చని చెప్పారు.  

1952 ఆగస్టు 6న శ్యాం ప్రసాద్ ముఖర్జీ సావర్కార్ కలుసుకున్నారు.  ఆ సందర్భంగా గా ముఖర్జీ బెంగాల్ లో హిందువులు ముస్లింలు సయోధ్యతో  ఉన్నారని  చెప్పారు. దానికి వీర సావర్కర్ కలకత్తాలో,  తూర్పు పాకిస్తాన్ లో హిందువులపై జరిగిన మారణకాండను మీరు విస్మరిస్తున్నారా ?  అని ప్రశ్నించారు.

ఇంకొక సందర్భంలో మాట్లాడుతూ సిక్కులు హిందూ జాతిలో భాగమని గురు గోవింద్ సింగ్”ఖల్సా పంథా  సకల జగత్తు లో ప్రఖ్యాతి కావాలి,  హిందూ ధర్మం చిరస్థాయిగానిలవాలి  మిధ్యా   తత్వాలు నశించాలి అని”    చెప్పిన మాటలను సావర్కర్ గుర్తు చేశారు. సావర్కార్ అంటే త్యాగము ,  ఒక సిద్ధాంతం.  వేరు వేరు రాజకీయ దృష్టికోణాలు ఉన్న  గాంధీజీ ని మహాత్ముడు అని,  సావర్కర్ ను వీర సావర్కర్ అని ప్రస్తుతించారు.  

వీర సావర్కార్ 1966 ఫిబ్రవరి 26న యోగ మార్గంలో ఈ లోకాన్ని వదలిపెట్టారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర  నుండి కాంగ్రెస్ హిందుత్వ జాతీయ వాదాన్ని ,హిందూ సంస్థలను వ్యతిరేకిస్తూ సమాజంలో ఆ సంస్థలపై దుష్ప్రచారం చేస్తుండేది. అందుకే స్వతంత్రభారతంలో కూడా సావర్కర్ కు అడుగడునా  ఆంక్షలు , అవమానాలకు గురి అయ్యారు.

హిందూ మహాసభ చరిత్రలో కలిసిపోయింది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని కూడా వేటాడుతూ వెంటాడుతు వచ్చారు. దేశంలో దానికి ఇంకా ముగింపు రాలేదు.  ఇంకోప్రక్క ఇస్లాం క్రిస్టియన్ మతం మార్పిడులు ఏకపక్షంగా  కొనసాగుతూనే ఉన్నాయి.   స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న పరిస్థితులలో పూర్తి మార్పు రాలేదు. ఆ మార్పు కోసం వేగంగా అడుగులు వేయటమే సావర్కార్కు మనం సమర్పించే నిజమైన  నివాళీ.