కొత్త పార్టీ సన్నాహాలలో ఈటెల రాజేందర్!

మంత్రివర్గం నుండి ఉద్వాసనకు గురైన ఈటెల రాజేందర్ భవిష్యత్ రాజకీయ ప్రణాళిక గురించి పలు ఊహాగానాలు చెలరేగుతున్న సమయంలో ఆయన కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.  తాజాగా ఈటల ట్విట్టర్ లో తన ప్రొఫైల్ లో చేసిన మార్పులే అందుకు తార్కాణంగా ఉంటున్నాయి.
ఈ ప్రొఫైల్ లో ఈటెల రాజేందర్ ఆకుపచ్చ కండువా కప్పుకొని తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపం, జ్యోతిరావు పూలే, ప్రొఫెసర్ జయశంకర్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫొటోలను ఉంచారు. అంతేకాకుండా ఉద్యమం పిడికిలి కూడా ఇందులో ఉంది. బీసీ, ఎస్సీ లను కలుపుకొని పోయే విధంగానే ఆయన పార్టీ ఆవిష్కరణ జరగనుందని ఆయన ప్రొఫైల్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఈట‌ల రాజేంద‌ర్ బీసీ నేత‌. తెలంగాణ ఉద్య‌మ కాలం నుంచి అనేక ఉద్య‌మ‌, ఉద్యోగ‌, కుల సంఘాల‌తో సంబంధాలు ఉన్న నేత‌.
 రాష్ట్రంలోనే బ‌ల‌మైన బీసీ నేత‌గా పేరుగాంచిన స‌మ‌ర్థుడు. అందుకనే బిసి అజెండాగా కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. తెలంగాణ ‘ఆత్మగౌవరం’ పేరుతో ఈటల టీఆర్ఎస్ సర్కార్ పై పోరాటం మొదలు పెడుతున్నారు. తనకు పదవులు ముఖ్యం కాదు, ఆత్మగౌవరమే ముఖ్యమని ఇప్పటికే ఆయన పలు సందర్భాల్లో చెప్పారు.
కొత్త పార్టీ కోసం అన్ని ప్రణాళికులు సిద్దం చేసుకుంటున్న ఈటల అతి తర్వలో భారీ బహిరంగ సభ పెట్టి పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సభ వేదికగానే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అందుకు కొంత సమయం పెట్టె అవకాశం ఉంది. పైగా అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నరేళ్లవరకు సమయం ఉండడంతో కనీసం మరో ఏడాది పాటు ఆగే అవకాశం ఉంది.
ఈ లోగా వివిధ వర్గాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.  ఇక ఆయన వెంట నడిచే నాయకులపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే హుజురాబాద్ లో టిఆర్ఎస్ క్యాడర్ ఎక్కడికి పోకుండా పక్క ప్లాన్ చేస్తున్నారు. మరోవంక రంగంలోకి దిగిన ఈ ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావు నియోజకవర్గ నాయకులను పిలిపించుకొని స్వయంగా మాట్లాడుతున్నారు.
నియోజకవర్గంలో ఈటలను ఒంటరి చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నం చేస్తున్నది.  కానీ ఈటల మాత్రం హుజూరాబాద్ ప్రజలు ఎప్పటికి తనవైపే ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనకు మద్దుతు ఇచ్చే వారిపై టీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టడంతో ఈటల తన వ్యూహాన్ని మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. బయటకు టీఆర్ఎస్ కు మద్దుతు ఇచ్చినా, నాయకుల మద్దతు  మాత్రం తనకే ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాఉ బీసీ సంఘాలను తనవైపే ఉన్నారనే సంకేతాన్ని కూడా ఈటల ఇప్పటికే పంపించారు.