దేశంలో 5,424 బ్లాక్ ఫంగస్ కేసులు  

దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఇంతవరకూ 5,424 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. కోవిడ్‌పై మంత్రుల గ్రూపుతో సోమవారం జరిపిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బ్లాంగ్ ఫంగస్ కేసుల్లో మెజారిటీ కేసులు కోవిడ్ బారిన పడిన వారేనని, వారిలో సగమందికి డయాబెటిస్ కూడా ఉందని చెప్పారు.

18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇంతవరకూ 5,424 మందికి బ్లాగ్ ఫంకస్ వచ్చిందని పేర్కొన్నారు. వీరిలో 4,556 మందికి కోవిడ్ చరిత్ర ఉందని, 55 శాతం మంది పేషెట్లకు మధుమేహ వ్యాధి ఉందని వివరించారు.

కోవిడ్ బారిన పడిన రోగులలో బ్లాక్ ఫంగస్ కేసుల ట్రెండ్ క్రమంగా దేశంలో పెరుగుతోంది. కోవిడ్ ట్రీట్‌మెంట్‌లో హెచ్చు మోతాదులో స్టెరాయిడ్స్ వాడటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఇన్‌ఫెక్షన్ సోకిన వారిని గుర్తించేందుకు వీలుగా బ్లాగ్ ఫంగస్‌ను అంటువ్యాధుల చట్టం-1987 కింద నోటిఫయబుల్ వ్యాధిగా పలు రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి.

వ్యాధుల స్క్రీనింగ్, డయాగ్నసిస్, మేనేజిమెంట్ విషయంలో కేంద్రం మార్గదర్శకాలను అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్ సెంటర్లు, మెడికల్ కాలేజీలు అమలు చేస్తున్నాయి. కోవిడ్ పేషెంట్లలో, ముఖ్యంగా కోవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్లలో బ్లాగ్ ఫంగస్‌ను గుర్తుస్తున్నారు. ఇది ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధిగా చెబుతున్నారు.

కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీ సహా పలు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగుచూస్తున్నాయి. కోవిడ్ చికిత్స సమయంలో ఇండస్ట్రియల్ ఆక్సిజన్ ఉపయోగించడం అనేది బ్లాగ్ ఫంగస్ పెరుగుదలకు కారణమవుతోందా అనే అంశంపై కూడా కర్ణాటకలో నిపుణులు అధ్యయనం చేస్తున్నారు.

ఇలా ఉండగా,  దేశంలో కొత్తగా మరో ఫంగస్ బయటపడింది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారితో పాటు బ్లాక్, వైట్ ఫంగస్‌లతో సతమతమవుతుంటే తాజాగా ఎల్లో ఫంగస్ పుట్టుకొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో తొలి ఎల్లో ఫంగస్ కేసు నమోదు అయింది. ఈ ఎల్లో ఫంగస్.. బ్లాక్, వైట్ ఫంగస్‌ల కంటే కూడా ఎక్కువ ప్రమాదకరమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

ఎల్లో ఫంగస్ బారిన పడిన తొలి రోగి ప్రస్తుతం ప్రముఖ ఈఎన్‌టీ డాక్టర్ బ్రిజ్ పాల్ త్యాగి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఎల్లో ఫంగస్ వ్యాధి ఉన్నవారిలో నీరసం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం తదితర లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వ్యాధి తీవ్రంగా ఉన్నవారిలో చీము కారే లక్షణం కూడా ఉంటుందని వైద్యులు అంటున్నారు.