చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు

మెగాస్టార్ చిరంజీవి మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో తాను ముందుకు వచ్చి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దీన్ని యుద్ద ప్రాతిపదికన పూర్తిచేయనున్నారు.

ఇటీవల కరోనా మరణాలు మెగాస్టార్‌ను కదిలించాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయానికి ఆక్సిజన్ అందక ఎవరూ మరణించకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఆక్సిజన్ బ్యాంక్ స్థాపన. తన ఆలోచనను కుమారుడు రామ్‌చరణ్‌తోనూ పంచుకున్నారు.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో ఓ బృహత్తర ప్రణాళికను రూపొందించారు. అలా యుద్దప్రాతిపదికన ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటవుతోంది. వారం రోజుల్లో ఈ బ్యాంక్ తన సేవలను ప్రారంభించబోతోంది.

ఆ ఆక్సిజన్ బ్యాంక్ పర్యవేక్షణ బాధ్యత అంతా రామ్‌చరణ్ చూస్తారు. మెగా అభిమానులను కూడా ఇందులో భాగస్వాముల్ని చేయబోతున్నారు. ఆయా జిల్లాల అభిమాన సంఘాల అధ్యక్షులు అక్కడ వీటి నిర్వహణ బాధ్యత చూస్తారు. దీని అధికారిక ప్రకటనను ట్విట్టర్ ద్వారా రామ్‌చరణ్ విడుదల చేశారు.

తెలుగువారందరికీ ఈ ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులో ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా ట్విట్టర్ అకౌంటును కూడా ప్రారంభించారు. ఇప్పుడున్న ఆక్సిజన్ సంక్షోభాన్ని అరికట్టే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించబోతున్నట్లు వివరించారు. మెగా అభిమానులు కూడా దీనిలో భాగస్వాములు కానున్నారని చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఓ ప్రకటనలో తెలిపింది