
దేశంలోని వైద్యులతో పాటు ఇతర వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బందికి ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు ప్రకటించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలోనూ వారు నిరుపమాన సేవలు చేస్తున్నారని, దేశం మొత్తం వారికి రుణపడి ఉందని ప్రధాని మోదీ ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దేశంలోని వైద్యులు, ఫీల్డ్ ఆఫీసర్లతో పాటు ఇతర వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాను నియంత్రించడంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఎదురైన అనుభవాలను మోదీ అడిగి తెలుసుకున్నారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
కరోనా పరిస్థితులతో పాటు ‘ముకోర్మైకోసిస్’ వ్యాధి గురించి కూడా చర్చించారు. ఈ వ్యాధి గురించి తెలుసుకోవడానికి వైద్యులు లోతైన పరిశోధన చేయాలని, ప్రజలకు లోతైన అవగాహన కల్పించాలని మోదీ సూచించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో శారీరక సంరక్షణతో పాటు మానసికంగా కూడా సంరక్షణ ప్రాముఖ్యతను సూచించాలని పిలుపునిచ్చారు. పరీక్షలు, మందుల సరఫరా, మౌలిక సదుపాయాల విషయాల్లో చర్యలను వేగవంతం చేయాలని, ఆక్సిజన్తో పాటు కరోనా ఇబ్బందులను కూడా అధిగమించాలని వైద్యులకు మోదీ సూచించారు.
సెకండ్ వేవ్లో ఫ్రంట్ లైన్ యోధులతో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన వ్యూహం సత్ఫలితాలిచ్చే సూచనలు కనిపిస్తున్నాయని, 90 శాతం మంది ఆరోగ్య రంగంలో ఉన్న వారు ఇప్పటికే మొదటి డోసును తీసుకున్నారని పేర్కొన్నారు.
కరోనా కట్టడిలో ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. దవాఖానలలో ఉండే ఆక్సిజన్ నిల్వలపై నిత్యం ఆడిట్ చేయాలని ఆయన వైద్యులకు సూచించారు.
More Stories
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
ఇది ప్రతి భారతీయుడి విజయం
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం