
సంగం డెయిరీ కేసులో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను నిబంధనలకు విరుద్ధంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంపై ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నరేంద్ర తరపున న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ వాదించారు.
జ్యూడిషియల్ రిమాండ్లో వున్న నరేంద్రను కోర్టుకు తెలియకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎలా తరలిస్తారని ఏసీబీ కోర్టు నిలదీసింది. కోర్టు అనుమతిని ఎందుకు తీసుకోలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. నరేంద్రను వారం రోజుల పాటు ఐసోలేషన్లో ఉంచమని వైద్యులు తెలిపినప్పటికీ, జైలుకు ఎలా తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోవిడ్ వచ్చిన వారు 14 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని తెలిపినప్పటికీ ఎలా తరలించారని ఏసీబీ కోర్టు ప్రశ్నించింది. నరేంద్రను రాజమండ్రి ప్రైవేట్ ఆస్పత్రికి లేదా విజయవాడ ఆయూష్ ఆస్పత్రికి తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.
అయితే నరేంద్రను ప్రతిసారీ విజయవాడకు తరలించాలంటే కష్టంగా ఉందని ఏసీబీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాజమండ్రి ప్రైవేట్ ఆస్పత్రిలో ఖాళీ ఉంటే అక్కడే చేర్పించాలని, లేని పక్షంలో విజయవాడ ఆస్పత్రికి తీసుకురావాలని కోర్ట్ ఆదేశించింది. ఈసారి మాత్రం కోర్టు అనుమతి లేకుండా తీసుకెళ్లొద్దని ఏసీబీ న్యాయస్థానం స్పష్టం చేసింది.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ