అజిత్ సింగ్ క‌రోనాతో క‌న్నుమూత‌

కరోనా కాటుకు మ‌రో రాజ‌కీయ ప్ర‌ముఖుడు ప్రాణాలొదిరారు. కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ‌ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్ క‌రోనాతో కన్నుమూశారు. 

82 ఏండ్ల అజిత్ సింగ్ ఏప్రిల్ 22న కరోనా బారినప‌డ్డారు. అప్ప‌టినుంచి గురుగ్రామ్‌లోని మేదాంత ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ఊపిరితిత్తుల‌లో ఇన్‌ఫెక్ష‌న్ కార‌ణంగా మంగ‌ళ‌వారం రాత్రి ఆయ‌న పరిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారింది. ప‌రిస్థితి విష‌మించ‌డంతో గురువారం తెల్ల‌వారుజామున‌ తుది శ్వాసవిడిచారు. 

మాజీ ప్ర‌ధాని చౌద‌రీ చ‌ర‌ణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్.. కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రిగా కూడా ప‌నిచేశారు. ప్రముఖ రైతు నేతగా గుర్తింపు పొందారు. అజిత్ సింగ్ 1939లో జ‌న్మించారు. ఆయ‌న ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌, ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (చికాగో)లో ఉన్న‌త విద్య అభ్య‌సించారు.

అమెరికాలో 15 ఏండ్ల‌పాటు కంప్యూట‌ర్ ఇండ‌స్ట్రీలో ప‌నిచేసిన ఆయ‌న.. త‌న తండ్రి చ‌ర‌ణ్ సింగ్‌ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత దేశానికి తిరిగి వ‌చ్చారు. 1986లో తొలిసారిగా రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని  బాఘ్‌ప‌ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏడు సార్లు లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

మాజీ ప్ర‌ధాని వీపీ సింగ్ ప్ర‌భుత్వంలో కేంద్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా, పీవీ న‌ర‌సింహారావు ప్ర‌భుత్వంలో ఆహార శాఖ మంత్రిగా ప‌నిచేశారు. 1996లో కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి రాష్ట్రీయ లోక్‌ద‌ళ్ పార్టీ (ఆర్ఎల్డీ)ని స్థాపించారు. 

అనంత‌రం 2001లో వాజ‌పేయి ప్ర‌భుత్వంలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా ప‌నిచేశారు. 2003 వ‌రకు ఎన్‌డీఏ భాగ‌స్వామిగా ఉన్నారు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప‌లికారు. తెలంగాణ ఉద్య‌మానికి సంపూర్ణ‌ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

అజిత్ సింగ్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటిస్తూ ఆయన ఎల్లప్పుడూ రైతుల ప్రయోజనాలకోసం అంకితమైన నేత ని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. కేంద్రంలో ఏ మంత్రిత్వ శాఖలో అయినా తన బాధ్యతలను సమర్ధవంతంగా నెరవేర్చారని పేర్కొన్నారు. ఆయన కుటుంభం సభ్యులకు ఆయన సంతాపం తెలిపారు.