కొవిడ్‌ సామగ్రికి ఐజీఎస్టీ మినహాయింపు

కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్‌లో ఉచితంగా పంపిణీ చేసేందుకు విదేశాల నుంచి లేదా విరాళాల రూపంలో అందుకొనే కొవిడ్‌-19 సహాయ సామగ్రికి ఇంగ్రేటెడ్‌ జీఎస్టీ (ఐజీఎస్టీ)ని మినహాయించింది. ఈ మినహాయింపు జూన్‌ 30 వరకు అమల్లో ఉంటుంది. 

విరాళాల రూపంలో అందజేసే కొవిడ్‌ సహాయ సామగ్రికి ఐజీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ విదేశాల్లోని పలు సంఘాలు, చారిటబుల్‌ సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది. 

ఇప్పటికే భారత్‌కు దిగుమతై పోర్టుల్లో కస్టమ్స్‌ అనుమతి కోసం ఎదురు చూస్తున్న సరుకులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. ఇలాంటి సహాయ సామగ్రికి ఐజీఎస్టీని మినహాయించే అంశం రాష్ట్ర ప్రభుత్వాలు, అధీకృత సంస్థలు, సహాయ సంస్థలు లేదా చట్టబద్ధ సంస్థల పరిధిలో ఉంటుందని కేంద్రం పేర్కొన్నది. 

ఇలాంటి సహాయ సామగ్రిని ఏ రాష్ట్రమైనా లేదా గుర్తింపు పొందిన ఎలాంటి సహాయ, చట్టబద్ధ సంస్థలైనా ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. 

ఇలా దిగుమతి చేసుకున్న వస్తువులకు సదరు దిగుమతిదారులు కస్టమ్స్‌ విభాగం నుంచి అనుమతి పొందాలంటే.. ఆయా వస్తువులు ఉచితంగా పంపిణీ చేసేందుకు తెప్పించినవేనని ధ్రువీకరిస్తూ నోడల్‌ అథారిటీ నుంచి పొందిన సర్టిఫికెట్‌ను సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది.