మ‌మ‌తా, స్టాలిన్‌, విజ‌య‌న్‌కు ప్ర‌ధాని శుభాకాంక్ష‌లు

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య శంఖారావం మోగించిన ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌, త‌మిళ‌నాడు డీఎంకే అధినేత స్టాలిన్ ల‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు. 

ఈ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌ధాని స్పందిస్తూ.. ఎన్నిక‌ల్లో విజయం సాధించిన మమతా దీదీకి అభినందనలు. ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో త‌మ పార్టీని ఆశీర్వ‌దించిన సోద‌ర సోద‌రీమ‌ణుల‌కు కృత‌జ్ఞ‌తలు. బెంగాల్‌లో బీజేపీ ఉనికి గ‌ణ‌నీయంగా పెరిగిందని ప్రధాని పేర్కొన్నారు.

బీజేపీ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుందని చెబుతూ ఎన్నికలలో ఉత్సాహంగా ప‌నిచేసిన ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు అభినంద‌న‌లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, కొవిడ్‌-19 మహమ్మారిని అధిగమించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం సాధ్యమైనంత మద్దతును కొనసాగిస్తుంద‌ని ప్ర‌ధాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 

కేరళ అసెంబ్లీ ఎన్నికపై స్పందిస్తూ.. విజయం సాధించిన ఎల్‌డీఎఫ్‌ను, సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌కు మోదీ అభినంద‌నలు తెలిపారు. కొవిడ్‌-19 మ‌హ‌మ్మారిపై పోరాటంలో క‌లిసి ప‌ని చేద్దామ‌ని సూచించారు. ఈ ఎన్నికలలో త‌మ పార్టీకి మద్దతు ఇచ్చిన కేరళ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అట్టడుగుస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కష్టపడ్డ కార్య‌క‌ర్త‌ల‌ను అభినందన‌ల‌ని పేర్కొన్నారు.

అదేవిధంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన డీఎంకే అధినేత స్టాలిన్‌కు మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రాంతీయ ఆకాంక్ష‌లు నెర‌వేరేలా, జాతీయ పురోగతిని పెంచేందుకు, కొవిడ్-19 మహమ్మారిని ఓడించేందుకు క‌లిసి ప‌నిచేద్దామ‌ని పిలుపునిచ్చారు.