నిర్ణయాత్మక దశలో నక్సల్స్‌తో పోరాటం

నిర్ణయాత్మక దశలో నక్సల్స్‌తో పోరాటం

నక్సల్స్‌తో పోరాటం నిర్ణయాత్మక దశకు చేరుకుందని, ఈ దిశగా అమర జవాన్ల త్యాగాన్ని దేశం మరువదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. చత్తీస్‌ఘఢ్‌లో శనివారం జరిగిన నక్సల్స్‌ దాడిలో మరణించిన జవాన్లకు ఆయన నివాళులు అర్పించారు. వీరమరణం పొందిన జవాన్ల భౌతిక కాయాలపై పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. 

అనంతరం చత్తీస్‌ఘఢ్‌ సీఎం భూపేష్‌ బాఘేల్‌తో కలిసి నక్సల్స్‌ దాడిపై జరిగిన ఉన్నతస్ధాయి సమావేశంలో పాల్గొన్నారు. దేశ ప్రధాని, కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రజల తరపున తాను నక్సల్స్‌ దాడిలో మరణించిన భద్రతా సిబ్బందికి నివాళులు అర్పించానని అమిత్‌ షా పేర్కొన్నారు.

గిరిజన ప్రాంతాల్లో తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు సాయుధ గ్రూపులపై పోరును తీవ్రతరం చేస్తామని చెప్పారు. కాగా, చత్తీస్‌ఘఢ్‌లోని సుక్మా స‌రిహ‌ద్దులో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో సుమారు 22 మంది సీఆర్‌పీఎఫ్, కోబ్రా, డీఆర్‌జీ జ‌వాన్లు వీర‌మ‌ర‌ణ పొందిన విష‌యం తెలిసిందే.

కాగా, చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనలో నిఘా కానీ, కార్యాచరణ వైఫల్యం కానీ లేదని సిఆర్‌పిఎఫ్‌ చీఫ్‌ కుల్దీప్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఈ ఘటనలో  25-30 మంది మావోయిస్టులు కూడా మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. అయితే ఇంకా అధికారిక సంఖ్య వెలువడలేదని ఎదురు కాల్పుల ఘటనను పర్యవేక్షిస్తున్న కుల్దీప్‌ తెలిపారు. 

ఏదైనా నిఘా వైఫల్యం చెందిందనుకుని ఉంటే… బలగాలు ఆపరేషన్‌కు వెళ్లి ఉండేవి కావని పేరొన్నారు. ఆపరేషన్‌ వైఫల్యం చెంది ఉంటే… ఎక్కువ మంది మావోయిస్టులు మృతి చెంది ఉండేవారు కాదని చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ, మృతి చెందిన మావోయిస్టులనుద్దేశించి మాట్లాడుతూ…. వారిని తరలించేందుకు మూడు ట్రాక్టర్లను వినియోగించారని సమాచారం అందినట్లు పేర్కొన్నారు. 

ఎంత మంది మావోయిస్టులు చనిపోయారో ఇప్పుడే సరైన సంఖ్య చెప్పలేమన్న ఆయన… 25-30 మంది చనిపోయి ఉండవచ్చునని అంచనా వేశారు. అదేవిధంగా ఈ దాడిలో ఏడుగురు సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. క్షతగాత్రులను కలవనున్నట్లు వెల్లడించారు.