డొనాల్డ్ ట్రంప్ బాటలో నడుస్తున్న మమత

డొనాల్డ్ ట్రంప్ బాటలో నడుస్తున్న మమత
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాటలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ నడుస్తున్నారని బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ధ్వజమెత్తారు. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల సంద‌ర్భంగా ట్రంప్ ప్రవర్తించినట్లుగానే ప్ర‌స్తుతం మమత ప్రవర్తిస్తున్నారని విమ‌ర్శించారు. 

బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల రెండో దశ పోలింగ్‌ సందర్భంగా నందిగ్రామ్ నియోజకవర్గంలో గురువారం మమతాబెన‌ర్జి ప్రవర్తించిన తీరును ఘోష్‌ తప్పుబట్టారు. టీఎంసీ ఇలాంటి పనులు చేస్తుందని తాము ముందే ఊహించామని పేర్కొన్నారు.

ఓటమి తర్వాత కూడా వాళ్లు ఇలాంటి పనులే చేస్తారని, డొనాల్డ్ ట్రంప్ బాటలో మమత నడుస్తున్నారని మండిప‌డ్డారు. మ‌మ‌త‌కు ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌నే విష‌యం అర్థ‌మైంద‌ని, అందుకే ఆమె గురువారం నందిగ్రామ్‌లో సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

ఓటమిని అంగీకరించడం చాలా కష్టమని, అయితే ఆమెకు భవిష్యత్తు గురించి అర్థమైపోయిందని, అందుకే ఆమె గురువారం నందిగ్రామ్‌లో సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఎద్దేవా చేశారు. ఓ పోలింగ్ బూత్‌లో ఆమె దాదాపు రెండు గంటలపాటు ఉన్నార‌ని, ఇది ఎన్నిక‌ల నియ‌మావ‌ళికి విరుద్ధమని చెప్పారు. ఏప్రిల్ 1న నందిగ్రామ్‌లో పోలింగ్ సంద‌ర్భంగా ఓ పోలింగ్ బూత్ ముందు బీజేపీ, టీఎంసీ కార్య‌క‌ర్త‌లు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు.

ఈ కార‌ణంగా అప్ప‌టికే పోలింగ్ బూత్‌లో ఉన్న మ‌మ‌తాబెన‌ర్జి బ‌య‌టికి రాలేదు. అక్కడి నుంచే బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌కు ఆమె ఫోన్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ఎన్నికల సంఘం విఫలమైందని ఆరోపించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.