నందిగ్రామ్‌లో హింస‌.. సువేందు కాన్వాయ్‌పై రాళ్ల దాడి

పశ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న నందిగ్రామ్‌కు గురువారం పోలింగ్ జరుగుతున్న సంద‌ర్భంగా పోలింగ్ స‌ర‌ళిని ప‌రిశీలిస్తున్న బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి కాన్వాయ్‌పై రాళ్ల దాడి జ‌రిగింది. అయితే ఈ ఘ‌ట‌న‌లో సువేందు మాత్రం గాయ‌ప‌డ‌లేదు. 

నందిగ్రామ్‌లోని స‌తేన్‌గ‌బ‌రి ప్రాంతంలో ఈ దాడి జ‌రిగింది. సువేందు కాన్వాయ్ వెంటే ఉన్న మీడియా వాహ‌నం ఈ రాళ్ల దాడిలో ధ్వంస‌మైంది. మ‌రోవైపు ప‌శ్చిమ మిడ్నాపూర్‌లో మ‌రో బీజేపీ అభ్య‌ర్థి ప్రీతిశ‌రంజ‌న్ కోనార్ కాన్వాయ్‌పై కూడా దాడి జరిగిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఇక్క‌డ జ‌రిగిన హింస‌లో ఓ బీజేపీ కార్య‌క‌ర్త మృతి చెందాడు.

కాగా, నందిగ్రామ్ లో బేకుటియా ప్రాంతానికి చెందిన బీజేపీ కార్యకర్త ఉదయ్ దూబే గురువారం ఉదయం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయ్ దూబే సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి రోడ్ షో కు హాజరైన తర్వాత టీఎంసీ నుంచి బెదిరింపులు రావడంతో తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని, ఇతని ఆత్మహత్యకు టీఎంసీనే కారణమని బీజేపీ నేతలు ఆరోపించారు.

 మరోవంక,  నందిగ్రామ్‌లో ఉన్న పోలింగ్ బూత్‌ను సందర్శించిన సీఎం మమతా బెనర్జీ స్థానిక అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గవర్నర్ జగదీప్ ధన్కర్‌కు నేరుగా ఫోన్ చేసి సామాన్య ప్రజానీకాన్ని పోలింగ్ బూత్‌లోకి రానివ్వడం లేదు. ఓటు హక్కును వినియోగించుకోనివ్వడం లేదని అంటూ ఫిర్యాదు చేశారు. 

“ఉదయం నుంచి నేను ప్రచార పర్వంలో ఉన్నాను. దయచేసి ఈ సమస్యపై దృష్టి సారించండి.’’ అంటూ సీఎం మమత ఫోన్‌లో గవర్నర్‌ను కోరారు. యూపీ, బీహార్ ప్రాంతాల నుంచి వచ్చిన వారు పోలింగ్ బూత్‌ ముందు నానా హంగామా సృష్టిస్తున్నారని దీదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.